కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు స్పష్టం చేశారు. రైతుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరు పాడి పరిశ్రమేనని, పాల ఉత్పత్తి ఎంత పెరిగినా కొనుగోలు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి పాలను కొంటామని, అందుకనుగుణంగా మార్కెట్ను విస్తరిస్తామన్నారు. ‘నమస్తే తెలంగాణ’కు గురువారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, సంస్థ పురోగతి, అందిస్తున్న సేవలను వివరించారు.
నమస్తే :రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ అంటే పెద్ద లక్ష్యం కదా..? ఏయే ప్రాంతాల నుంచి సేకరిస్తారు?
చైర్మన్ : ఇన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నాం. దానిని యథావిధిగా కొనసాగిస్తూనే.. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పాలను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అందుకు కావాల్సిన బల్క్కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట, మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం లింగాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్, సిద్దిపేట జిల్లా అంతక్కపేట మండలం అక్కన్నపేట, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమ్మునూరు, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, మానకొండూర్ మండలం వెల్ది-లక్ష్మీపూర్ ప్రాంతాల్లో బల్క్ కూలింగ్ సెంటర్లు నిర్మాణం అవుతున్నాయి. ఇప్పటికే సీఎం ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం.అలాగే నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో మరికొన్నిచోట్ల కూలింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలిస్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడ పాల ఉత్పత్తి ఉంటే అక్కడ కరీంనగర్ డెయిరీ సేకరణ ఉంటుంది.
నమస్తే : డెయిరీ విస్తరణకు అనుగుణంగా పాల సేకరణ ఉంటుందా..?
చైర్మన్ : ముందుగా పాలసేకరణకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ చేసేందుకు అవసరమైన అధునాతన మిషనరీని ఏర్పాటు చేసుకుంటున్నాం. పాల ఉత్పత్తి, సేకరణ వంటి అంశాలపై ఇప్పటికే దృష్టిపెట్టాం. 1998లో కరీంనగర్ డెయిరీ కేవలం 4 వేల లీటర్లను సేకరించేది. రైతులకు అవగాహన కల్పిస్తూ.. కుటుంబాలకు అండగా నిలుస్తూ పాడివైపు మళ్లించాం. ప్రస్తుతం రోజుకు లక్షా యాభై వేల నుంచి 2 లక్షల లీటర్ల వరకు సేకరణ జరుగుతున్నది. ఇది భవిష్యత్లో కచ్చితంగా పెరుగుతుంది. రైతుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా నిలిచేది కేవలం పాడి పరిశ్రమే. వ్యవసాయంలో కొన్నిసార్లు నష్టాలున్నా.. పాడి అలా కాదు. ఉత్పత్తి ఉంటే చాలు సేకరణ, అందుకు అనువైన మార్కెటింగ్ మేం చూసుకుంటాం. రైతులందరికీ అవగాహన కల్పిస్తాం. దీంతోపాటు ముఖ్యమంత్రి తెచ్చిన దళితబంధు ద్వారా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 610 పాడి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. వాటి ద్వారా ఈ ప్రాంతం నుంచి రోజుకు 2,500 నుంచి 3 వేల లీటర్ల పాల సేకరణ పెరిగింది. భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశమున్నది. దీంతో పాటు చాలా మంది రైతులు పాడి పరిశ్రమవైపు మొగ్గుచూపుతున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ డెయిరీని ఐదు లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరింపజేస్తున్నాం.
నమస్తే : డిమాండ్ ఎలా ఉన్నది? మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉన్నది?
చైర్మన్ : మార్కెట్లో పాలకు మంచి డిమాండ్ ఉంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రోజుకు 3 లక్షల లీటర్ల పాల అవసరమున్నది. కానీ, అన్నీ కలిపి రెండు నుంచి రెండున్నర లక్షలకు మించి సరఫరా ఉండడం లేదు. అంటే దాదాపు రోజుకు 50 వేల నుంచి లక్ష లీటర్ల వరకు బయట నుంచి వస్తున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ తీసుకుంటే.. అక్కడికి రోజుకు 10 లక్షల లీటర్లు రాష్ర్టేతర ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. అందుకే హైదరాబాద్ మార్కెటింగ్పై ప్రధానంగా దృష్టిపెట్టాం. నాణ్యత, మన్నికకు కరీంనగర్ డెయిరీ పెట్టింది పేరు అన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది. అందుకే పాలతోపాటు డెయిరీ ఉత్పత్తులకు అనతి కాలంలోనే హైదరాబాద్లో మంచి డిమాండ్ ఏర్పడింది. మన వద్ద పెరిగే పాల సేకరణకు అనుగుణంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని మరింత విస్తరిస్తాం. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను. పాల ఉత్పత్తి ఎంత పెరిగినా నాణ్యతను బట్టి మంచి ధర ఇచ్చి కొనే బాధ్యతను కరీంనగర్ డెయిరీ తీసుకుంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు.
నమస్తే : దళితబంధు పథకం కింద పాడిగేదెలు వస్తున్నాయి. మీ డెయిరీ సహకారం ఎలా ఉన్నది? డెయిరీకి కూడా ప్రత్యామ్నాయ వనరుల సేకరణపై దృష్టి పెడుతున్నారా?
చైర్మన్ : కరీంనగర్ డెయిరీ ప్రగతిని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు మెచ్చుకున్నారు. అంతేకాదు, దళితబంధు లబ్ధిదారులకు అండగా నిలువాలని సూచించారు. ఆ మేరకు లబ్ధిదారులకు మంచి పాడి గేదెలు కొనివ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. హర్యానా రాష్ట్రంలోని రోతక్, జింద్, కర్నాల్, గుజరాత్ రాష్ట్రంలోని మైసానా, తమిళనాడులోని ఇరోడా వంటి ప్రాంతాలకు లబ్ధిదారులను నేరుగా తీసుకెళ్లి.. విక్రేతలతో స్వయంగా మాట్లాడి గేదెలు కొనుగోలు చేసుకునేలా సహకరిస్తున్నాం. ఇప్పటికే మా డెయిరీ తరఫున ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 610 పాడి యూనిట్లను గ్రౌండింగ్ చేయించాం. వాటి ద్వారా రోజుకు 2500 నుంచి 3 వేల లీటర్ల పాల వరకు వస్తున్నాయి. వారంతా సంతృప్తితో ఉన్నారు. ఇవేకాకుండా మా డెయిరీ పరిధిలో చేరే సభ్యులకు అనేక రకాలుగా సహకారం అందిస్తున్నాం. ఒకవైపు పాడి రైతుకు అండగా నిలుస్తూ.. డెయిరీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మరోవైపు డెయిరీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యామ్నాయ వనరుల సేకరణపై కూడా దృష్టి పెట్టాం. అందుకోసం డెయిరీ తరఫున పెట్రోల్ బంకుల ఏర్పాటు, 58 డెయిరీ పార్లర్స్ను స్వయంగా నడుపడం, జగిత్యాల, కరీంనగర్, రామకృష్ణాపూర్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా అద్దె రూపంలో కొంత ఆర్థిక వనరులు వచ్చేలా చూస్తున్నాం.
నమస్తే తెలంగాణ : డెయిరీ భవిష్యత్ లక్ష్యం ఏమిటి?
చైర్మన్ : కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే 60 శాతం విజయం సాధించాం. లక్ష్యం నెరవేరడానికి రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలు సేకరించాలని అనుకున్నాం. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతమున్న డెయిరీ 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉన్నది. భవిష్యత్ అవసరాలతోపాటు మా లక్ష్యం నెరవేరేందుకు 65 కోట్లతో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద మరో 3 లక్షల కెపాసిటీతో అధునాతన డెయిరీని నిర్మించాం. ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తున్నది. అతి త్వరలోనే ప్రారంభిస్తాం. దీంతో కరీంనగర్ డెయిరీ ఐదు లక్షల లీటర్ల సామర్థ్యానికి చేరుకుంటుంది.
నమస్తే : ఉత్పత్తిదారులకు డెయిరీ తరఫున అందిస్తున్న సేవలెలా ఉన్నాయి?
చైర్మన్ : పాడి రైతు బాగుంటేనే డెయిరీ బాగుంటుంది. ఈ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఉత్పత్తిదారులను ఏనాడూ వ్యాపార ధోరణితో చూడడం లేదు. బహుశా మా డెయిరీ నుంచి అందిస్తున్న సేవలు మరెక్కడా లేకపోవచ్చు. 50 శాతం సబ్సిడీపై వ్యాధి నిరోధక టీకాలు ఇస్తాం. అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేక అంబులెన్స్, దూడల్లో నట్టల నివారణకు 75 శాతం సబ్సిడీపై గోలీలు, మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం 1,200 కేంద్రాల్లో కృత్రిమ గర్భోత్పత్తి నిర్వహణ, ఆడ దూడలు మాత్రమే జన్మించేందుకు 50 శాతం సబ్సిడీపై సార్టెడ్ సెమెన్, మన్నికైన దూడలను అందించడం, 25 శాతం సబ్సిడీపై మినరల్ మిక్చర్, 50 శాతం సబ్సిడీపై మేలు రకపు పశుగ్రాసపు విత్తనాలు, డెయిరీలోని సభ్యులకు 80 వేల వరకు రుణ సదుపాయం, ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి తీసుకొచ్చిన వాటికి 90 శాతం రవాణా సబ్సిడీ, ఉత్పత్తి దారులెవరైనా చనిపోతే తక్షణ ఆర్థిక సాయం కింద 5 వేల నుంచి 7 వేలు చెల్లింపు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, కల్యాణమస్తు కింద పుస్తె మట్టెలు, పసుపు, కుంకుమ, పాడి రైతులకు వృద్ధాప్య సంక్షేమ పథకం.. ఇవి మాత్రమే కాదు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
నమస్తే : పాడిని ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎందుకు చూపాలనుకున్నారు?
చైర్మన్ : నేను స్వయానా రైతును. అందులోనూ పద్నాలుగేళ్ల పాటు సర్పంచ్గా పనిచేశాను. ఈ సమయంలో వ్యవసాయరంగంలో ఎన్నో ప్రకృతి విపత్తులను చూశాను. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా. ఒక వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటే వారి భవిష్యత్తు ఎప్పుడు చిక్కుముళ్లతో కూడుకొని ఉంటుంది. అందుకే రైతుకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నదే నా తపన. అందుకు పాడి పరిశ్రమే ప్రత్యామ్నాయంగా ఉన్నది. పంటలు పండినా పండకపోయినా.. పాడి ఉంటే అన్నదాతలు ఆర్థికంగా చితికిపోరు. ఆత్మగౌరవం దెబ్బతినకుండా బతికే అవకాశముంటుంది. ప్రతి పదిహేను రోజులకోసారి అతని అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి. అందులో దళారుల వ్యవస్థ ఉండదు. ఈ పాడి ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు చాలా ఉపయోగపడుతాయి. అందుకే రైతులను ఈ దిశగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నా. చాలా వరకు ఈ విషయంలో కరీంనగర్ డెయిరీ సక్సెస్ అయింది. ఇంకా మా సిబ్బంది, ఉత్పత్తిదారులందరితో కలిసి ఈ పాల సేకరణను అనుకున్న లక్ష్యం మేరకు పెంచే ప్రయత్నం చేస్తా. దీని ద్వారా డెయిరీకే కాదు, రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి దొరికి ఆర్థికంగా బలోపేతమవుతారన్నదే నా తపన.