కార్పొరేషన్, జూన్ 12: కరీంనగర్లో ఇంటింటి నుంచి వచ్చే చెత్తను రీైస్లెకింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని నగర మేయర్ వై సునీల్రావు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం నగరంలోని డీఆర్సీసీ కేంద్రాలను మేయర్ పరిశీలించారు. పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రాలకు తరలించి వాటిని అక్కడి నుంచి అవరసమైన ఇతర సంస్థలకు పంపించడంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా వేర్వురు చేసి రిక్షాలు, ఆటోలకు అందించాలన్నారు. తడి చెత్తలను వర్మీ కంపోస్టు కేంద్రాలకు తరలించి ఎరువులను తయారు చేస్తున్నామన్నారు. అలాగే పొడి చెత్తలో రీైస్లెకింగ్కు ఉపయోగపడే వ్యర్థాలను డీఆర్సీసీ కేంద్రాలకు పంపిస్తున్నామన్నారు. నగరంలో ప్రతి రోజు వెలువడుతున్న 240 మెట్రిక్ టన్నుల చెత్తలో అతి తక్కువ మొత్తంలో డంప్యార్డుకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న డంప్యార్డును బయో మై నింగ్ పద్ధతిలో పూర్తిగా క్లీన్ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని కోరారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన..
పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లల్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త వేర్వురుగా చేయడంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని 22, 3, 30, 35, 42, 25, 33, 60, 55 డివిజన్లల్లో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఇంటి యజమానికి తమ ఇండ్ల నుంచి వచ్చే చెత్తను బల్దియా అందించిన రెండు చెత్త బుట్టలను వినియోగించి తడి, పొడి చెత్తలను వేరు చేయాలని సూచించారు. వానకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, బల్దియా అధికారులు ఉన్నారు.