హుజూరాబాద్, జూలై 9: గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టారని, ఆయనతోనే రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా హుజూరాబాద్ మండలంలోని కందుగుల, పెద్దపాపయ్యపల్లెల్లో శుక్రవారం పర్యటించారు. ముందుగా రెండు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడడం గత నాయకుడి పుణ్యమేనని విమర్శించారు. మండలానికి 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనా ఇంతవరకు ఒక ఇల్లు కూడా లబ్ధిదారుడికి ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం ఆయన చలవేనని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘనత ఆ నాయకుడికే దక్కుతుందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి అమోఘమని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు.
కర్ణాటకలో వృద్ధాప్య పింఛన్ కేవలం 500లే ఇస్తున్నారని, అవి కూడా ఆరు నెలల నుంచి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాను అక్కడికి వెళ్లినప్పుడు ఓ వృద్ధురాలిని అడిగితే ఆవేదనతో చెప్పిందన్నారు. వృద్ధాప్య పింఛన్ను ఒకేసారి 2వేలకు పెంచిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలకు డబ్బులు కేటాయించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. యాసంగి సీజన్లో రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలుకు 30వేల కోట్లను కేటాయించారని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేసీఆర్ 8వేల కోట్లు వెచ్చించేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నారని వివరించారు. ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఐదు పాఠశాలలను ఎంపిక చేసుకొని ముందుగా వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగా హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామంలోని పాఠశాల బలోపేతం కోసం 2కోట్లు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.
పూర్వ విద్యార్థులతో కమిటీ వేసి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. కందుగుల ఎస్సీ కాలనీని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు మంత్రికి విన్నవించగా, అక్కడే ఉన్న మిషన్ భగీరథ ఎస్ఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వారం రోజుల్లో నీళ్లు సరఫరా చేసేందుకు ఎస్ఈ వెంటనే చర్యలు చేపడుతానన్నారు. మిషన్ భగీరథలో ఎస్సీ కాలనీలో కొత్త వాటర్ ట్యాంక్, పైపులు వేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాలపై వరాల జల్లు కురిపించారు. కందుగుల ఎస్సీ కాలనీకి 25లక్షలు, పెద్దపాపయ్యపల్లె గ్రామ పంచాయతీకి 50లక్షలను అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎంపీపీ ఇరుమళ్ల రాణీ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.