కరీంనగర్ కార్పొరేషన్, మే 28 : ఇప్పుడు ప్రైవేట్ జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. పైసా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు నగరాలు, పట్టణాల్లో విరివిగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. వాకింగ్ చేసే ప్రాంతాలు, పార్కుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక్కోచోట పదికిపైగా వ్యాయామ పరికరాలను సిద్ధంగా ఉంచింది. పూర్తి ఉచితంగా.. ఎప్పుడంటే అప్పుడు వ్యాయామం చేసుకునే అవకాశముండగా, నగర, పట్టణవాసుల నుంచి విశేష స్పందన వస్తున్నది. పిల్లలు మొదలు వృద్ధుల దాకా ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తు చేస్తుండడం కనిపిస్తున్నది.
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ రంగానికే పరిమితమైన జిమ్లను.. ఇప్పుడు ఓపెన్ జిమ్ల పేరిట అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే 443 ఏర్పాటు చేయగా.. ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 70కిపైగా నెలకొల్పింది. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేసే ప్రాంతాలు, పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసి, ఒక్కోచోట పదికిపైగా వ్యాయామ పరికరాలు, ఇతర సదుపాయాలు కల్పించారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఎక్సర్సైజ్ చేసేలా పరికరాలను అందుబాటులో ఉంచడంతో అన్ని రకాల వ్యాయామం చేసుకునే వీలు ఏర్పడింది. ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుండగా, అంతటా విశేష స్పందన వస్తున్నది. కరోనా మొదలైనప్పటి సంది ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి, మంచి ఆహారం తీసుకోవడమే కాదు.. వ్యాయామం చేయడం కనిపిస్తున్నది.
ఓపెన్ జిమ్లో ప్రజలు ఇటు ఆహ్లాదం, అటు ఆరోగ్యం ఒకేసారి పొందుతున్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు వీటిని ఉపయోగించుకుంటున్నారు. టీనేజ్ పిల్లలు, యువతీయువకులు, సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. మహిళలు కూడా పురుషులకు దీటుగా ఎక్సైర్సైజ్ చేస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా.. ఒక్క రూపాయీ ఖర్చు లేకుండా ఎంత సేపైనా జిమ్ చేసుకునే అవకాశముండడంతో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉదయం వేళ ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వ్యాయామంతో ఎంజాయ్ చేస్తున్నారు. అంతటా ఓపెన్ జిమ్లు రద్దీగా మారడంతో కొత్తగా తమకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలంటూ నగర, పట్టణ ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు. కరీంనగర్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. పది రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్థలం ఉంటే ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం పెంపునకు ఇవి ఎంతో ఉపయోగపడుతుండడంతో అన్ని మున్సిపాలిటీల పరిధిలో వీటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓపెన్ జిమ్లో పరికరాలివే..
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో అత్యాధునిక వ్యాయామ పరికాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ వాకర్, పుష్ చైర్, ఎయిర్ స్వింగ్, షోల్డర్ వీల్, లెగ్ప్రెస్, ఫుల్ చైర్, స్టాండింగ్ ట్విస్టర్, డబుల్ క్రాస్ వాకర్, ఎల్లిప్టికర్ ఎక్సర్సైజ్, లెగ్లిఫ్ట్, సిట్టింగ్ ట్విస్టర్ ఇలా పదికిపైగా పరికరాలు ఉన్నాయి.
రూపాయి ఖర్చు లేకుండా..
ప్రైవేట్లోని ఏ జిమ్కు వెళ్లినా తక్కువలో తక్కువగా నెలకు 500 వరకు చెల్లించాలి. ఇంకొంచెం మంచి జిమ్ అయితే 800 వరకు.. ఏసీ జిమ్లు అయితే 1200కుపైగా కట్టాలి. మళ్లీ టైం పాటించాల్సి ఉంటుంది. అదే ఓపెన్ జిమ్ అయితే రూపాయి ఖర్చు లేకుండా వ్యాయామం చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఓపికున్నంత సేపు సాధన చేయవచ్చు.
ఆహ్లాదం.. ఆరోగ్యం
తెల్లారి లేచింది మొదలు పడుకునే దాకా ఉరుకులు పరుగుల జీవితం.. మారిన ఆహారపు అలవాట్లు.. కరువైన శారీరక శ్రమ.. పెరిగిన మానసిక ఒత్తిడి.. వెరసి 30ఏళ్లకే ఆరోగ్య సమస్యలు.. వీటి నుంచి బయటపడాలంటే నడక లేదా వ్యాయామం ఒక్కటే మార్గం. కానీ, మొన్నటి వరకు జిమ్ చేయాలంటే ఎక్కడో సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ జిమ్లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రతి నెలా ఫీజు కట్టినా.. నిర్ణీత సమయం ప్రకారమే వ్యాయామం చేసే అవకాశముండేది.
ఆర్నెళ్ల నుంచి చేస్తున్నా
ఉదయం పూట వాకింగ్ చేసుకున్న తర్వాత వ్యాయామం చేసేందుకు మాలాంటి వాళ్లకు ఈ ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగంగా ఉంది. కాళ్లు, కీళ్ల నొప్పులు రాకుండా ఉండేలా ఎక్స్ర్సైజ్లు చేసుకోవచ్చు. పెద్ద జిమ్లకు వెళ్లకుండా సమీప ప్రాంతాల్లో వ్యాయామం చేసుకోవచ్చు. గత ఆర్నెళ్లుగా ప్రతి రోజూ ఇక్కడ వ్యాయామం చేస్తున్నా. ఎంతో బాగుంది.
నడక తర్వాత వ్యాయామం చేస్తాం
వేములవాడ మండల పరిషత్ కార్యాలయ అవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఉదయం నడక తర్వాత ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తుంటాం. ప్రతిరోజూ చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిమ్లు బాగా ఉపయోగపడుతున్నయ్. ఇక్కడికి రోజూ సుమారు 30 మంది వరకు వస్తారు.
కరీంనగరంలో 3.50 కోట్లతో 30 ప్రాంతాల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. మానేరు డ్యాం ప్రాంతంతోపాటు అంబేద్కర్ స్టేడియం, ఎస్ఆర్ఆర్ కళాశాల, కశ్మీర్గడ్డ, హౌసింగ్బోర్డు కాలనీ, అలకాపురి, విద్యానగర్, జ్యోతినగర్, మార్క్ఫెడ్తో పాటుగా ఇతర అనేక ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. హుజూరాబాద్లో 1.32 కోట్ల వ్యయంతో 11, జమ్మికుంటలో 60 లక్షల వ్యయంతో 5 జిమ్స్ ఏర్పాటు చేశారు. చొప్పదండి, కొత్తపల్లిలో నూతనంగా జిమ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ పార్క్, అంబేద్కర్ మినీ స్టేడియం ఆవరణలో రెండు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి 10లక్షల వ్యయం చేశారు. కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డులో 13 లక్షల వ్యయంతో, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 25 లక్షలతో ఒపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 18 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి 6.20లక్షలు వ్యయం చేశారు. వేములవాడ పట్టణంలోని మండల కార్యాలయ ఆవరణ, రెండో బైపాస్ గంగమ్మ గుడి వద్ద, జగిత్యాల బస్టాండ్లో 33లక్షలతో మూడు ఓపెన్జిమ్లు ఏర్పాటు చేశారు.
ఎంతో ఉత్సాహం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్లు ఎంతో ఉపయోగపడుతున్నయ్. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయొచ్చు. నేను ప్రతి రోజూ చేస్తున్నా. అన్ని అవయవాలు కదిలే విధంగా.. సులువుగా చేసుకునే విధంగా పరికరాలు ఉన్నాయి. జిమ్ల కోసం ఎక్కడెక్కడికో వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మున్సిపాలిటీ నుంచి వీటిని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. వాకింగ్ చేసిన తర్వాత, ఓ అరగంట ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.
– లావణ్య, కరీంనగర్
జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా
నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నా. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఉచితంగా శిక్షణ తీసుకుంటున్న. ఉదయం గ్రౌండ్లో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడే ఓపెన్ జిమ్లో వ్యాయామ సాధన చేస్తున్నా. ప్రత్యేకంగా జిమ్కు వెళ్లాలంటే వీలు కావడం లేదు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేస్తున్న ప్రాక్టీస్లో ఓపెన్ జిమ్ చాలా ఉపయోగంగా ఉంది.
– స్రవంతి, కానిస్టేబుల్ అభ్యర్థి (సిరిసిల్ల)
అందుబాటులో ఉన్నా..
రోజూ ఉదయాన్నే సింగరేణి స్టేడియానికి వాకింగ్ కోసం వస్తుంటా. గతంలో ఇక్కడ ఓపెన్ జిమ్ లేదు. ఎక్కడో దూరంలో ఉండడం వల్ల వెళ్లలేకపోయే వాళ్లం. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవ తీసుకొని ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది. చాలా మంది వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకు మా వాకర్స్ తరఫున కృతజ్ఞతలు.
– కాంటా రవి, తిలక్నగర్ (గోదావరిఖని)
ప్రతి రోజూ వస్తా
పీజీ కాలేజీ మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి రోజూ వస్తున్నా. ముందుగా వాకింగ్ చేసి తర్తా జిమ్లో వ్యాయామం చేస్తుంటా. ప్రకృతి మధ్యన ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తుంటే ఉల్లాసంగా ఉంటుంది.
– సదయ్య, కానిస్టేబుల్ గోదావరిఖని
అందరికీ సౌలభ్యంగా ఉంది
యూనివర్సిటీ పీజీ కాలేజీలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఉండడం వల్ల స్థానికులు ప్రతి రోజూ ఇక్కడికే వస్తున్నారు. ప్రైవేట్ జిమ్లకు వెళ్లి ఫీజులు చెల్లించలేని వారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నేను కూడా ప్రతి రోజూ వస్తుంటా. అసలే పారిశ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలో వ్యాయామం ఎంతో అవసరం.
– పూసాల శ్రీధర్, గోదావరిఖని
సంపూర్ణ ఆరోగ్యం
నిత్యం వ్యాయామం చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. సిరిసిల్ల మున్సిపల్ అధికారులు పట్టణంలోని చాలా చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటుచేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, పార్కులు, వార్డుల్లోని ప్రధాన కూడళ్లు, కొత్త చెరువు ప్రాంతాల్లో ఉన్నాయి. మేము రోజూ కళాశాల మైదానంలో వాకింగ్ చేసిన తర్వాత ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తాం. చాలా ఉపయోగంగా ఉంది.
– గెంట్యాల గోపి, వస్త్ర వ్యాపారి (సిరిసిల్ల)
యువతకు బాగా ఉపయోగపడుతయ్..
ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి గవర్నమెంట్ చాలా మంచి పనిచేసింది. మాలాంటి యువతకు ఎంతో బాగా ఉపయోగపడుతయ్. మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నయ్. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎక్సర్సైజు చేసుకోవచ్చు. అదే జిమ్కు వెళ్తే ఫీజు కట్టాల్సి ఉంటుంది. పైగా సమయానికి వెళ్లాలి. ఇప్పుడు ఓపెన్ జిమ్లో అన్ని పరికరాలు ఉన్నయ్. ఎప్పుడు వీలుంటే అప్పుడు జిమ్ చేయవచ్చు. పైగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
– బాబు, కరీంనగర్