జగిత్యాల టౌన్, మే 28: పట్టుదల, ప్రణాళిక ఉంటే కోచింగ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని, అందుకు తానే ఉదాహరణ అని జగిత్యాల ఆర్డీవో మాధురి చెప్పారు. జాబ్ సాధించాలన్న సంకల్పం ఉండాలని, అభ్యర్థులు సెల్ఫోన్లు, సినిమాలకు స్వస్తి పలకాలని సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగర్థులకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎక్కువ చదవడం వల్ల జాబ్ సాధించలేమని, ప్రణాళికా బద్ధంగా చదివితేనే జాబ్ సాధించవచ్చని సూచించారు.
సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దని చెప్పారు. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువ సమయం రాత్రిళ్లు చదవకుండా ఉదయం 5 నుంచి 7 గంటల వరకు చదవడం మంచిదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయంలో అన్ని రకాల గ్రూప్స్కు సంబంధించిన బుక్స్, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.