కమాన్చౌరస్తా, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగనుండగా, ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 39,173మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 231కేంద్రాలను సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లాలో 80సెంటర్లు ఏర్పాటు చేయ గా, 12,786 మంది పరీక్ష రాయనున్నారు. ఇక జగిత్యాల 67 సెంటర్లు, 11,826 విద్యార్థులు, పెద్దపల్లిలో 49 సెంటర్లు, 8180 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 35 సెంటర్లు పెట్టగా, 6;381మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నా రు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, లోపాలు లేకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
సర్వం సిద్ధం..
పది పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో రెడీ చేశారు. ఆయా కేంద్రాల్లోని గదులను కడిగి శానిటైజ్ చేయించడం, పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రంగా ఉంచారు. ఎండల తీవ్రత దృష్ట్యా తరగతి గదుల్లో మంచినీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు సరిగ్గా తిరిగేలా చర్యలు తీసుకున్నారు.
భయం వీడితేనే విజయం
ప్రతి విద్యార్థి జీవితంలో ఎదుర్కొనబోయే తొలి పబ్లిక్ పరీక్ష కావడంతో సహజంగానే వారి లో భయాందోళన గూడు కట్టుకొని ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతంగా చదివి, రాస్తేనే మంచి మార్కులు వస్తాయి. ఈ మేరకు విద్యార్థులకు అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
విద్యార్థులు ఇలా చేయండి
విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందే అనుమతినిస్తున్న నేపథ్యంలో ముందుగానే చేరుకోవాలి. ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్పై ఉన్న వివరాల్లో ఏమైనా తప్పులుంటే హెచ్ఎంలకు తెలియజేయాలి. ఓఎంఆర్పై ఉన్న వివరాలను సరిచూసుకుని ప్రధాన జవాబు పత్రానికి పిన్ మిషన్తో సీల్వేసి ఇవ్వాలి. ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ షీట్ను మొదటగా పూర్తిగా అవగాహన చేసుకొని అందులో ఇచ్చిన బాక్స్లో నీటుగా సంతకం చేయాలి. అదనంగా తీసుకునే షీట్స్పై క్రమసంఖ్య నంబర్ వేసి వాటిని ఇచ్చేముందు సరిచూసుకోని పంచ్ చేసి ఇవ్వాలి.
పరీక్ష హాల్లో ఆందోళనగా అనిపిస్తే దీర్ఘంగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలాలి. ఇలా ఐదు సార్లు అవసరాన్ని బట్టి ఎక్కువసార్లు చేస్తే ఆందోళన కలగదు.
పరీక్ష హాల్లో మొదట బాగా చదివి గుర్తున్న ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశాంతంగా ఉంటే మిగిలిన ప్రశ్నల జవాబులు కూడా గుర్తుకు వస్తాయి. అవసరమనిపిస్తే 3 లేదా 4 సార్లు నెక్రోల్స్, క్లాక్వైజ్, ఆంటీ క్లాక్ వైజ్ నెమ్మదిగా చేయాలి. ఇలా చేస్తే ఆందోళన త్వరగా తగ్గిపోతుంది.
ప్రశాంతమైన స్థితిలో పరీక్షలు బాగా రాయవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
భయం వీడి విశ్వాసంతో రాయాలి
విద్యార్థులు ముందుగా పరీక్షలంటే భయంవీడి ఆత్మవిశ్వాసంతో రాస్తేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. టీచర్లు బోధించిన పాఠాలను క్షుణ్ణంగా చదవాలి. అలాగే ప్రతి విషయాన్ని పరీక్షకు ముందు ఒకటికి రెండు సార్లు అవగాహన చేసుకోవాలి. కష్టంగా భావించే అంశాలను ముందుగా చదివేందుకు సమయం కేటాయించాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా మనోధైర్యం పెంచుకోవాలి.
– డా. పున్నంచందర్, తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకోవాలి
చాలా మంది విద్యార్థుల్లో పరీక్ష రాయడంపై అవగాహన లేకపోవడంతో అనుకున్న స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నారు. పరీక్ష కేంద్రంలో ముందుగా ప్రశ్నపత్రాన్ని పరిశీలించి మనకు వచ్చిన, తేలికైన సమాధానాలు ముందే రాసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. జవాబు పత్రంలో ప్రశ్న నంబర్, సైడ్హెడ్డింగ్స్, పదాల మధ్యన ఖాళీస్థలం చూడడానికి నీటుగా, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. పరీక్షలకు హాజరవుతున్న రోజుల్లో సమయానికి తగిన నిద్ర, ఆహారం తీసుకోవాలి. – గన్నమనేని శ్రీనివాస్రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు