శంకరపట్నం, మే 22: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందిన ఘటన కేశవపట్నంలో అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నగరంలోని సీతారాంపూర్కు చెందిన అజిత్, ప్రవీణ్ ఇద్దరు స్నేహితులు. వీరి ఫ్రెండ్ బంధువులు వరంగల్ నుంచి మంచిర్యాలలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. తిరుగు పయనంలో వారిని వరంగల్లో దింపేందుకు శనివారం రాత్రి తన కారు లో కరీంనగర్ దాకా తీసుకొచ్చాడు. కొంచెం వేరే పని పడిందని, తన బంధువులను వరంగల్లో దింపి రావాలని మిత్రులైన అజిత్, ప్రవీణ్ను కోరాడు. తన కారు ఇచ్చి పంపించాడు. అయితే వారిని అజిత్, ప్రవీణ్ వరంగల్లో దింపి కరీంనగర్కు తిరుగుపయనమయ్యారు. కేశవపట్నం శివారులోకి రాగానే కారు అదుపు తప్పి ఎడమ వైపున ఉన్న చెట్టును బలంగా ఢీకొని బోల్తా పడింది. కారు నడుపుతున్న ప్రవీణ్తో పాటు ముందు సీటులో కూర్చున్న అజిత్కు తీవ్రగాయాలై ఘటన స్థలంలోనే మృతి చెందారు. యువకుల మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా, ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి జేసీబీ సాయంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను కరీంనగర్ మార్చురీకి తరలించారు. మృతులు కొంత కాలంగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అతి వేగంగా కారు నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అజిత్ తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
మ్యారేజ్డే మరునాడే భార్యాభర్తలు మృతి
మ్యారేజ్ డే మరుసటి రోజే రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందిన ఘటన వరంగల్ హంటర్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. హనుమకొండలోని సుబేదారి ఎస్ఐ పున్నంచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథలో తాడూరి సారయ్య టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తన భార్య సుజాతతో కలిసి ఆదివారం ఖమ్మం నుంచి స్వగ్రామం హుజూరాబాద్ మండలం రాజపల్లికి కారులో బయలు దేరారు. వరంగల్ హంటర్రోడ్డు బ్రిడ్జి వద్ద రాగా ఎదురుగా హనుమకొండ అదాలత్ నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొన్నది. దీంతో ఆ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా పైకి లేచి బ్రిడ్జి మీద నుంచి 40 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడింది. సుజాత అక్కడికక్కడే చనిపోగా, సారయ్యను ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. డ్రైవర్ ఖాసిం పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.