తిమ్మాపూర్ రూరల్, మే 21: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తమకు పార్టీ ఏం చేసిందని రైతులు ప్రశ్నిస్తే కవ్వంపల్లితో పాటు నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. రైతులపై దాడికి దిగడం శోచనీయమన్నారు. ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గ్రామాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులు, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉందని, కేంద్రం చేతులెత్తేసినా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూములను సస్యశ్యామలం చేశామన్నారు.
అధికారం లేని కాంగ్రెస్కు డిక్లరేషన్ లేదని, ఎలక్షన్కో పార్టీలో ఉండే కవ్వంపల్లికి రాజకీయ అవగాహన శూన్యమన్నారు. మొగిలిపాలెంలో రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే, సహనం కోల్పోయి గూండాయిజాన్ని ప్రదర్శించారన్నారు. సెల్ఫీ వీడియోలో తనపై మాట్లాడే అర్హత నీకు ఉందా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కవ్వంపల్లిది అని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత-ఆంజనేయులు, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఆత్మ చైర్మన్ పాశం అశోక్రెడ్డి, దుండ్ర రాజయ్య, కృష్ణ, పెట్టం రమేశ్, జలపతి తదితరులు పాల్గొన్నారు.