కమాన్చౌరస్తా, మే 19 : శాతవాహన యూనివర్సిటీకి పర్మినెంట్ వీసీగా వచ్చిన ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని విభాగాలకు హెడ్స్, వసతి గృహాల బాధ్యతలు, యూనివర్సిటీ కళాశాలలకు ప్రిన్సిపాళ్ల నియామకం.. ఇలా అనేక మార్పులు చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఒక గాడిలోకి వచ్చింది. దీన్ని గుర్తించిన యూజీసీ సభ్యులు యూనివర్సిటీకీ 12-బీ హోదాను ఈ ఏడాది మార్చిలో కల్పించారు. ఈ క్రమంలో యూనివర్సిటీకి చెందిన ఐదుగురు కాంట్రాక్ట్ అధ్యాపకులు 12-బీ రాకుండా, సిఫారసు కోసం వచ్చే సభ్యులనే భయపెట్టేలా చేసిన చర్యలు బయటపడ్డాయి. దీంతో ఆ ఐదుగురు అధ్యాపకులను యూనివర్సిటీ నుంచి బర్తరఫ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకుని, పై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్వరాష్ట్రంలో, సొంత ప్రాంతంలో యూనివర్సిటీకి మంచి పేరు, గుర్తింపు తీసుకురావాల్సిన అధ్యాపకులే, తిండి పెట్టిన ఇంటికి ఎసరు పెట్టగా, వారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లేఖలో ఏం ఉందటే..
యూనివర్సిటీకి చెందిన ఐదుగురు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆరు లేఖలను తప్పుడు పేర్లతో యూజీసీ సభ్యులకు పంపినట్లు యూనివర్సిటీ అధికారులు నిర్ధారించారు. ఇందులో ప్రధానంగా యూనివర్సిటీకి చెందిన తెలుగు, ఇంగ్లిష్, బోటనీ, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి నాన్ సాంక్షన్డ్ డిపార్ట్మెంట్లలో ఉన్న అధ్యాపకులను డైరెక్ట్ ప్రొఫెసర్లుగా గుర్తించాలని, ఆ తర్వాతే యూజీసీ సభ్యులు యూనివర్శిటీకి వచ్చి 12-బీ గుర్తింపు ఇవ్వాలని, లేకుంటే యూజీసీ సభ్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టే అంటూ లేఖల్లో పేర్కొన్నట్లు సమాచారం. అంతే కాకుండా, యూనివర్సిటీ నుంచి యూజీసీకి పంపే సమచారం సైతం తప్పుగా ఉంటుందని, ఈ నివేదిక నమ్మితే తప్పుచేసిన వారవుతారని, దీనిపై కేసులు ఎదుర్కోక తప్పుదని లేఖలో స భ్యులను బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
విచారణ ప్రారంభమైంది ఇలా..
తమకు వచ్చిన లేఖలు, పంపిన వారిపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ యూజీసీ సభ్యులు యూనివర్సిటీ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. వీటిని పరిశీలించిన వీసీ మల్లేశ్, యూనివర్శిటీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జరిగిన విషయం వివరించారు. ఈ క్రమంలో అందరు అధ్యాపకులు ఇది ముమ్మాటికీ తప్పేనని, ఇందులో ఎంతటి వారు ఉన్నా యూనివర్సిటీ నుంచి తప్పించాలని, ఇందుకు తామంతా సిద్ధమని స్పష్టం చేశారు. అదే సమయంలో వీసీ మల్లేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోర్మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం, యూనివర్సిటీలో పలు విభాగాల్లో ఉపయోగిస్తున్న కంప్యూటర్లను రికవరీ చేసి, ఒక గదిలో ఉంచి సీజ్ చేశారు. ఇందులో ఇంగ్లిష్ విభాగానికి చెందిన లక్ష్మీప్రసాద్కు చెందిన కంప్యూటర్లో ఆరు లేఖలు బట్టబయలయ్యాయి. ఈ మేరకు వీసీతో పాటు ఫోర్ మెంబర్ సభ్యుల సమక్షంలో ఆయన్ను విచారించగా, తాను లేఖలు పంపానని, కానీ, తనను తెలుగు విభాగానికి చెందిన చక్రధర్ ప్రత్యక్షంగా ప్రోత్సహించారని తెలిపాడు. దీంతో చక్రధర్ను సైతం విచారించగా తన తప్పును ఒప్పుకుని లేఖ రాసిచ్చారు.
ఈ క్రమంలో వీరిని యూనివర్సిటీ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంప్యూటర్ సైన్స్కు చెందిన కమలాకర్ వాడిన కంప్యూటర్లో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు లేఖలు గవర్నర్కు పంపినట్లు లభ్యమయ్యాయి. దీంతో అతడిని విచారించగా ఆ లేఖల కోసం తన వద్ద ఉన్న కంప్యూటర్ను చక్రధర్, లక్ష్మీప్రసాద్, విజయ్కుమార్, శ్రీనివాస్ వాడారని తెలుపుతూ ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతోపాటు విజయ్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వానికి లేఖను పంపారు. అయితే, ఈ నలుగురినీ తప్పుదోవ పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన బోటనీ విభాగానికి చెందిన శ్రీనివాస్పై 2019 నుంచి యూనివర్సిటీలో తీవ్ర అభియోగాలు ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితుల మేరకు ఆయన ఎలాంటి తప్పుడు వ్యవహారాలు చేసినా, తప్పుగా వ్యవహరించినా యూనివర్సిటీ నుంచి తొలగించాలని ఉత్తర్వులు ఉండగా.. మొత్తం ఐదుగురినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
ఇంకా విచారణ కొనసాగుతున్నది
ఒక హోదాలో కొనసాగు తూ యూనివర్సిటీకి వ్యతిరేకంగా యూజీసీ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఐదుగురు అధ్యాపకులను టర్మినేట్ చేశాం. ఇప్పటికే వారిని తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తొలగించడంతోపాటు ఉన్నతాధికారులకు లేఖలు పంపాం. దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతున్నది. యూనివర్సిటీ బాగుకోసం మేం కృషి చేస్తుంటే ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న వారి విషయంలో ఉపేక్షించేది లేదు.
– ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల, వైస్ చాన్స్లర్, శాతవాహన యూనివర్సిటీ