Sadbhavana Yatra | నారాయణపేట: రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర నారాయణపేట (Narayanapeta) జిల్లాకు చేరింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి కృష్ణ మండలం రోడ్డు మీదుగా మక్తల్ చేరుకుంది. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి నేతృత్వంలో స్థానిక నాయకులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మక్తల్ అంబేద్కర్ చౌరస్తాకు యాత్ర చేరుకుంది. మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు ఏర్పాట్లు చేశారు.
యాత్ర కారణంగా జాతీయ రహదారిపై (National Highway) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్తో పాటు పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ ఏర్పడింది. అసలే అమావాస్య కావడంతో మక్తల్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. భక్తులు సైతం ట్రాఫిక్లో చిక్కుకుని అవస్థలు పడ్డారు. సద్భావన యాత్రకు స్వాగతం పలికే కార్యక్రమం ప్రజలకు అసౌకర్యంగా మారడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.