కమాన్చౌరస్తా, మే 19: నిండు వేసవిలో హనుమాన్ మాల ధారణ చేస్తూ పట్టణా లు, పల్లెల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారు. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన వైశాఖ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో దీక్ష స్వీకరిస్తున్నారు. ఆలయాలు, పవిత్ర ప్రదేశాల్లో మానసిక ప్రశాంతతో గడుపుతున్నారు. సాయంత్రం వేళల్లో భక్తిగీతాలు ఆలపిస్తూ భజనలు చేస్తూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
41, 21, 11 రోజుల దీక్షలు
హనుమాన్ దీక్షను భక్తులు వీలును బట్టి మండల కాలం 41 రోజులు, అర్ధ మండల కాలం 21 రోజులు, పావు మండల కాలం 11 రోజులు ఇలా మాల ధరిస్తున్నారు. దీక్ష సమయంలో చందనం రంగు చొక్కా, తెలుపు రంగు పంచె ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా ఉండాల్సి ఉంటుంది. దీక్షాకాలంలో స్వాములు క్రమశిక్షణతో మెలగాలి. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడాలి. తోటి స్వాములతో సఖ్యతగా ఉంటూ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. కోటీశ్వరుడైనా సరే దీక్షలో నేలపై కూర్చొని తోటిస్వాములతో కలిసి భోజనం చేసి, అందరితో కలిసి పూజ చేయాలి.
ఆరోగ్యానికి ఎంతో మేలు..
హనుమాన్ దీక్ష ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. చన్నీటి స్నానంతో రోగాలు దూరమవుతాయని, చెప్పులు లేకుండా నడవడంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఏకభుక్తంతో శరీర ఆకృతిమారిపోయి సాత్విక ఆహారంతో రోగాలు దరిచేరవు. నేలపై నిద్రించడంతో వెన్నునొప్పి లాంటివి దూరమవుతాయి. నుదుటిపై చందనం ధరించడం ద్వారా నుదిటి మధ్యభాగంలో అతి సున్నితమైన నరాలకు చల్లదనాన్ని ఇస్తుంది.
విరివిగా అన్నదానం
హనుమాన్ దీక్షాపరులకు జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాములు ఒకే పూట సాత్విక ఆహారం తీసుకుంటారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి ఆలయం, భగత్నగర్ హరిహర క్షేత్రంతో పాటు పలు ఆలయాల్లో ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల ఇండ్లల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, అభిషేక కార్యక్రమాలు జరిపించి భజనలు చేస్తున్నారు. మంకమ్మతోటలోని భక్తాంజనేయ ఆలయంలో ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం ఈ నెల 25వ తేదీ హనుమాన్ పెద్ద జయంతి వరకు కొనసాగనుంది. దీక్ష పూర్తయిన భక్తులు స్థానిక ఆలయాల్లో ఇరుముడి కట్టుకుని కొండగట్టు, భద్రాచలం వెళ్లి మొక్కులు చెల్లిస్తుంటారు. పలువురు జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి కాలినడకన సైతం కొండగట్టుకు వెళ్తుంటారు.
ప్రశాంతంగా ఉంటుంది
హనుమాన్ దీక్ష స్వీకరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతనతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. అందరం సమానమని తెలిపి, ఆధ్యాత్మికతతో గడపడం సంతోషంగా ఉంది. భజన కార్యక్రమాలు, దేవుడికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్న.
– గొట్టెముక్కులు రవీందర్, భక్తుడు
అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నం
ప్రతి సంవత్సరం హనుమాన్ దీక్ష స్వీకరిస్తున్న. వేసవిలో ఆధ్యాత్మికంగా గడపడం ఆనందంగా ఉంటుంది. మాల ధారణ చేసుకున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నం.
సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్న
మంకమ్మతోట భక్తాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్న. పెద్ద హనుమాన్ జయంతి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నం.
– కటకం ప్రసాద్, హనుమాన్ సేవా సమితి
భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నరు
భక్తాంజనేయ స్వామి ఆలయానికి దీక్షా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నరు. ఆలయం ఎదుట హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో కూడా భాగస్వాములవుతున్నరు. పలువురు సాయంత్రం సమయంలో అల్పాహారం పంపిణీ చేస్తున్నరు.
– మహేశ్, హనుమాన్ సేవా సమితి భక్తుడు