చొప్పదండి, మే19: సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసానిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. పార్టీలకతీతంగా పథకాలు వర్తింపజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో 142 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో బిడ్డల పెండ్లిళ్లు చేసేందుకు పేద తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గమనించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి బృహత్తర పథకానికి అంకురార్పణ చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఆడబిడ్డల లగ్గాలకు మేనమామలా లక్షానుటపదహారు రూపాయలు ఇస్తున్నారని కొనియాడారు. కాగా, ఒకేసారి 142 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడంతో చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
పార్టీలకతీతంగా చెక్కులు..
ప్రభుత్వం పార్టీలకతీతంగా పథకాలను వర్తింపజేస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తున్నది. మండలంలోని గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త రామడుగు లచ్చయ్య కూతురు పెళ్లికాగా అతడి భార్య భాగ్య పేరిట మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కును ఎమ్మెల్యే రవిశంకర్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు సంతోషంతో ఎమ్మెల్యే కు చక్కెర కు డుకలు పోసి ఆత్మీయతను చాటుకున్నారు. చా కుంటకు చెందిన టీడీపీ కార్యకర్త ఓరుగల తిరుపతి-మమతకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ది రాజయ్య-లక్ష్మికి ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుకరవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెల్మమల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కొత్తగంగారెడ్డి, తహసీల్దార్ ర జిత, సర్పంచులు గుంటరవి, వెల్మనాగిరెడ్డి, సురే శ్, శంకరమ్మ,పెద్ది శంకర్, తులసమ్మ, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, కౌన్సిలర్లు కొత్తూరి మహేష్,కోఆప్షన్ పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మశ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రా జేశ్వర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, మచ్చరమేశ్, కొండగట్టు ఆలయ డైరెక్టర్ గొ ల్లపెల్లి శ్రావణ్కుమార్, నేతలు నలుమాచు రామక్రిష్ణ, మాచర్ల వినయ్, మల్లేశం, లక్ష్మణ్, తిరుపతి, రాజేందర్ పాల్గొన్నారు.
కేసీఆర్ సాయాన్ని మరువలేం..
మాబిడ్డ పెండ్లి జేసిన వెంటనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నం. ఇటీవలే లక్షానుటపదహారు రూపాయల చెక్కు వచ్చింది. ఎమ్మెల్మే సుంకె రవిశంకర్ సారు చేతుల మీదుగా అందుకున్నాం. మా ఆయన టీడీపీలో తిరుగుతడు. గింత మంచి పథకం తెచ్చిన కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-ఓరుగల తిరుపతి-మమత, చాకుంట
అప్పు తేకుండానే పెండ్లిళ్లు జేసినం..
మాకు నలుగురు బిడ్డలు. తెలంగాణ రాకముందు ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు జేస్తే ఒక్క రూపాయి రాలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంక మూడు, నాలుగో బిడ్డల పెండ్లిళ్లు జేసినం. ఈ ప్రభుత్వం ఇద్దరికి రూ. లక్ష చొప్పున ఇచ్చింది. ఒక్కరూపాయి గూడ అప్పుజేయలేదు. మా ఆయన బీజేపీలో పనిజేత్తడు. అయినా కేసీఆర్ సారు ఈ పథకం కింద పైసలిచ్చిండు..
– రామడుగు భాగ్య-లచ్చయ్య