శంకరపట్నం, మే 19: జాతీయ ఆహార భద్రతా చట్టంతో మహిళలు, చిన్నారులకు పోషకాహారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఓరగంటి ఆనంద్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో జాతీయ ఆహార భద్రతా చట్టం-2013పై వైద్య-ఆరోగ్య, శిశు సంక్షేమ, పౌర సరఫరాల శాఖల అధికారులతో అవగాహన, సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆనంద్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన గల వారికి ఆహార భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ చట్టంలో భాగంగానే ప్రభుత్వం పేదలకు పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన పాలు, గుడ్లు, బాలామృతం తదితర ఆహారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
లబ్ధిదారులకు వాటిని సక్రమంగా అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల యంత్రాంగంపై ఉందన్నారు. ఆహార భద్రతా చట్టం పటిష్ట అమలుకు ఆయా శాఖల అధికారులు జవాబుదారీగా ఉండాలని కోరారు. చట్టం అమలు తీరు, లోటు పాట్లపై సమగ్రంగా చర్చించారు. పటిష్ట అమలుకు పలు సూచనలు చేశారు. లబ్ధిదారులకు న్యాయం జరుగకుంటే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్వో సురేశ్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, సీడీపీవో సబిత, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో జయశ్రీ, డీటీసీఎస్ వేణుగోపాల్, సివిల్ సైప్లె శాఖ ఇన్స్పెక్టర్ పత్తెం శ్రీనివాస్, ఎంఈవో నర్సింహారెడ్డి, వైద్యాధికారి షాకీర్ అహ్మద్, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాజశ్రీ, బ్లాండినా, గిర్దావర్ లక్ష్మారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.