జగిత్యాల, మే 18 (నమస్తే తెలంగాణ): సాగునీటి సంకల్పం సిద్ధించింది. అపరభగీరథుడి ప్రయత్నం ఫలించింది. దశాబ్దాలపాటు కరువు కోరల్లో చిక్కుకొని సాగుకే కాదు తాగునీటికి అల్లాడిన కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, గంగాధర, రామడుగు మండలాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. చుక్కనీరు రాక, చెరువులు అడుగంటి పోయి దశాబ్దాలపాటు బీడుపడ్డ నేల.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో పులకిస్తున్నది. సజీవ వరద కాలువ.. చెరువుల్లోకి చేరుతున్న జలాలతో పంటలకు పుష్కలంగా నీరందడమే కాదు భూగర్భజలం గణనీయంగా పెరిగింది. ఫలితంగా సాగు విస్తీర్ణం 43 శాతం పెరగ్గా, ఈ ప్రాంత రైతాంగం సంబురపడుతున్నది. ఇదంతా కేసీఆర్ చలువే అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని వేనోళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా నిర్మించారు. అయితే పాలకుల పట్టింపులేని తనంతో కాలక్రమేణా ప్రాజెక్టు తన సామర్థ్యాన్ని కోల్పోయింది. 1994లో 90.30 టీఎంసీలకు, 2013లో 80.13 టీఎంసీలకు కుదించుకుపోయింది. మొత్తంగా 31 టీఎంసీల నీటి నిల్వను కోల్పోగా, 28శాతం సామర్థ్యం తగ్గిపోయిందని నిపుణులు ప్రకటించారు. ఇక ఎగువన ఉన్న మహారాష్ట్ర గోదావరినదిపై కట్టిన అనేక చెక్డ్యామ్లు, ప్రాజెక్టులతో గోదావరిలో నీటి లభ్యత సైతం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారం చేసుకొని, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని ఎత్తిపోసే బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. 2017 ఆగస్టు 10న 1500 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువపై మూడు పంప్ హౌస్లు నిర్మించారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద ఒకటి, రాజేశ్వర్రావుపేట వద్ద మరొకటి, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఇంకో పంప్హౌస్ను నిర్మించారు. రెండేళ్ల వ్యవధిలోనే అంటే 2019లో పనులన్నీ పూర్తి చేశారు. దీంతో 2020 నుంచే వరద కాలువ గుండా నీటిని రాంపూర్, రాజేశ్వర్రావుపేట పంప్హౌస్లకు తరలిస్తున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
గత ప్రభుత్వాలు వరద కాలువకు తూములు పెట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. కానీ, సీఎం కేసీఆర్ కెనాల్ పొడవునా అవసరమున్న చోటల్లా తూములు పెట్టి, చెరువులను నింపేందుకు అవకాశమివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాంతో జగిత్యాల జిల్లాలో 27 తూములు ఏర్పాటు చేసి కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, మెట్పల్లి మండలాల్లోని 32 చెరువులను నింపడం మొదలుపెట్టారు. ఈ చెరువుల కింద దాదాపు 6 వేల ఎకరాల భూమి సాగు కావడంతోపాటు ప్రజల తాగు, ఇతర అవసరాలకు సైతం వినియోగించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే కరీంనగర్ జిల్లాలో 15 తూములు ఏర్పాటు చేస్తున్నారు. గంగాధర, రామడుగు మండలాల్లో 13 చెరువులను నింపుతున్నారు. దాంతో 3,191 ఎకరాలకు నీరందుతుండగా, ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని బోయినిపల్లి మండలం దేశాయిపల్లి వద్ద ఉన్న తూము ద్వారా విలాసాగరం చెరువును నింపుతున్నారు.
ఈ ఒక్క చెరువు కిందే 688 ఎకరాలు సాగవుతున్నది. మొత్తంగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పరిధిలో వరద కాలువ వెంట ఉన్న చెరువుల కింద 9వేల ఎకరాలకు నీళ్లందుతుండగా, గతంతో పోలిస్తే సాగు గణనీయంగా పెరిగింది. జగిత్యాల జిల్లాలో నాన్ ఆయకట్టుకు చెందిన ఐదు మండలాల్లో సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోవడంతో బావుల కింద వ్యవసాయం అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు చెరువుల కింద మళ్లీ సేద్యం చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద ఎకరాకు ఏటా 10వేలు ఇస్తుండడంతో రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పంటలు సాగు చేసే పరిస్థితులు లేక, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న ఈ ఐదు మండలాల రైతులకు పునర్జీవ పథకం వరదాయినిగా మారిపోగా, వారు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
జీవనదిలా వరదకాలువ..
జగిత్యాల జిల్లా నాన్ ఆయకట్టులో ఉన్న కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు మండలాలు దశాబ్దాల పాటు నరకం చూశాయి. ఈ మండలాలు ఎప్పుడు కరువు మండలాల జాబితాలో ఉండేవి. కొన్ని గ్రామాల్లో సాగునీటి సంగతి అటుంచితే తాగేందుకు నీళ్లు దొరికేవి కాదు. 1991లో ప్రతిపాదించబడి, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తవ్వించిన 122 కిలోమీటర్ల వరద కాలువ సైతం ఎందుకూ పనికిరాకుండా పోయింది. కానీ, సరిగ్గా ఐదేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి, పూర్తి చేసిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఈ ప్రాంత చిత్రాన్నే మార్చివేసింది. 2020 నుంచి వరద కాలువ జీవనదిలా మారింది. సాగుకు ఏ ఢోకా లేకుండా పుష్కలంగా నీరందిస్తూ ఒక భరోసా, నమ్మకాన్ని అందిస్తున్నది.
ఉప్పొంగిన భూగర్భజలం..
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాలువ జీవనదిలా మారింది. ఏడాదిలో దాదాపు తొమ్మిది నెలలు ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంటుంది. దాంతో కాలువ సమీప గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. ఇటు తూముల ద్వారా చెరువులను నింపుతుండడంతో ఆయాచోట్ల కూడా గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 15 మీటర్ల దిగువకు చేరిన భూగర్భజలాలు నేడు 4, 5 మీటర్ల లోతునే అందుబాటులో ఉన్నాయి. 2018 మార్చితో పోలిస్తే జగిత్యాల జిల్లాలోని ఐదు మండలాల్లో సగటున భూగర్భజలాల వృద్ధి 8.40 మీటర్లుగా ఉండగా, ఏప్రిల్లో 8.33 మీటర్లు వృద్ధి చెందాయి. భూగర్భజలాలు పెరుగడంతో వ్యవసాయ, చేద బావులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి
వ్యవసాయానికి ఢోకా లేదు
మా ఊరి ఉదకమ్మ మళ్లీ ఉబికి వచ్చింది. ఇక మాకు తిరుగులేదు. వ్యవసాయానికి ఢోకా లేదు. ఒకప్పుడు ఉదకమ్మ చెరువు నిండితే ఊరంతటికి మంచి జరుగుతుండెనట. మాకు బుద్ధి తెలిసినప్పటినుంచి ఎప్పుడూ చెరువు నిండలే. వరద కాలువ తవ్వినంక దాంట్ల నీళ్లు పారించి చెరువును నింపుతరు అనుకున్నం. నింపలే. గత ప్రభుత్వాలను అడిగినం. పని చేయలే. తెలంగాణ ఉద్యమంలో మా గోడు వెళ్లబోసుకున్నం. మా బాధలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం చేపట్టిండు. వరద కాలువను డ్యాంలా మార్చిండు. కాలువ పొడుగునా తూములు పెట్టి చెరువులు నింపుతున్నడు. మా ఉదకమ్మ చెరువును కూడా నింపిన్రు. చెరువుల నీళ్లుంటే బావుల్లోకి సైతం నీళ్లు వచ్చినయి. రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. కేసీఆర్ సార్ చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేం.
నేటి పాలనకు నిదర్శనం
ఈ చిత్రం నేటి టీఆర్ఎస్ సర్కారు పాలనకు నిదర్శనం. నాడు వట్టిపోయిన వరద కాలువ నేడు స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నది. అపరభగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘ఎస్సారెస్పీ పునర్జీవ పథకం’తో జీవనదిలా మారింది. ఏడాదిలో దాదాపు తొమ్మిది నెలల పాటు నిండుగా నీళ్లతో కళకళలాడుతున్నది. సమీప చెరువులనూ నింపుతున్నది. ఒకప్పుడు 15మీటర్ల దిగువన ఉన్న పాతాళగంగ, ఇప్పుడు నాలుగైదు మీటర్ల లోతులో సవ్వడి చేస్తున్నది. ఫలితంగా సాగునీటికే గాక తాగునీటికీ భరోసా దొరికింది.