మంథని టౌన్, మే 14: అభివృద్ధి చేయని వారికి ఓటేయడం ఎందుకు? నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గ ప్రజలకు చేసిందేంది? మంత్రిగా పనిచేసి కనీసం గ్రామాన్ని పట్టించుకోలేదేందుకు? అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పరోక్షంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబుపై ధ్వజమెత్తారు. మంథనిలోని తన రాజగృహంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి, కొడుకు ఇద్దరు కలిసి దాదాపు 30 ఏళ్లు మంథని నియోజకవర్గాన్ని పాలించినా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేంలేదన్నారు. ఒక అసమర్థుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఇక్కడి ప్రాంత ప్రజల తప్పిందని, తాము ఎంతగా నష్ట పోతున్నామో గ్రహించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. తాను ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికైన మంథని ప్రాంత అభివృద్ధి అహర్నిశలు కృషి చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే నిధులతో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. ధన్వాడ ప్రభుత్వ పాఠశాలకు సైతం 15 బెంచీలను అందించానని, శ్రీధర్బాబు మంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి ద్వారా బోయవాడలో రోడ్డు కోసం కొబ్బరి కాయకొట్టి వదిలేయగా, ఆ రోడ్డు నిర్మాణాన్ని సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమ యంలో పూర్తి చేశామన్నారు.
ప్రభుత్వం సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు నిర్వహిస్తున్న మన ఊరు-మన బడి కింద ధన్వాడ హైస్కూల్కు రూ. 42లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ. 21లక్షలు మంజూరు చేయించుకున్నాడని, అంటే తన హాయాంలో ఏమీ చేయలేదనే విషయం ఇట్టే అర్థమవుతున్నదన్నారు. మంథని ప్రజ లు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గుర్తించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రజలే మధ్యే ఉంటూ సేవలందించానన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి..పెరిగిన బిడ్డగా, ఇక్కడి ప్రజల కష్ట సుఖాలన్ని తెలిసిన వ్యక్తి అనేక సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి సమర్థుడికి పట్టంకట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కనవేని శ్రీనివాస్, రైతు బంధు మండలాధ్యక్షుడు ఆకుల కిరణ్, భూపాపల్లి టీఆర్ఎస్ నాయకుడు జక్కు రాకేశ్, టీఆర్ఎస్ నేతలు బత్తుల సత్యనారాయణ, గుండా పాపారావు ఉన్నారు.