కోనరావుపేట/గంభీరావుపేట, మే 14: గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో శనివారం కుండపోత పోసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా, ఈదురు గాలులకు పలువురి ఇంటి పై కప్పులు లేచిపోగా, కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడడం, మామిడిపల్లి కొనుగోలు సెంటర్లో పిడుగుపాటుకు ఐదుగురు రైతులకు గాయాలు కాగా, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని ఐకేపీ సెంటర్లో పిడుగుపడడంతో రైతులు అన్నాడి ఎల్లారెడ్డి, పన్నాల హన్మండ్లు, పన్నాల దేవీ వెంకటేశ్, మారు మెహిన్రెడ్డి, మారు బుచ్చిమల్లవ్వ విద్యుదఘాతానికి గురయ్యారు. అక్కడే ఉన్న రైతులు గమనించి చికిత్స కోసం వేములవాడ దవాఖానకు తరలించారు. అలాగే కనగర్తిలో ధాన్యం సెంటర్లో ధాన్యం, తూకం వేసిన బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రంలో గాలులకు లేచివచ్చిన రేకులు తగిలి రైతులు దొడ్డు శాంతవ్వ, మోకాళ్ల తిరుపతిరెడ్డికి గాయాలయ్యాయి. పుట్ట రేణవ్వ, మోత్కుపల్లి రేణ, మోత్కుపల్లి బాలయ్య, అండెం నర్సింహారెడ్డి, అండెం మల్లారెడ్డి ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్లు కోక్కుల భారత, అనుపాటి భారతి, ఎంపీటీసీలు లక్ష్మి, ప్రభాకర్రావు, ఉపసర్పంచ్ ఎల్లాల రాంరెడ్డి కోరుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు పాటుకు గోరంటాలలో కొమ్మన్నపల్లి రాజయ్య పాడి గేదె మృతి చెందింది. ముస్తాఫానగర్లో శివంది లక్ష్మీ, రాజేశ్వర్రావునగర్లో పల్లపు నర్సయ్య ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి కొట్టుకుపోయింది.