రాయికల్ రూరల్, నవంబర్ 29: మొఘల్ చక్రవర్తుల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడి తెలంగాణ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాయికల్ మండలం ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న విగ్రహాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అలాగే రాయికల్ మండలం కిష్టంపేట్లో ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అల్లీపూర్లో రూ. 7 లక్షలతో మురుగు కాల్వ, ధర్మాజీపేట్లో రూ.17 లక్షలతో వంతెన మరమ్మతు పనులకు భూమి పూజ చేశారు. ఇటిక్యాల పెద్ద వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇటిక్యాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, భావితరాలను చైతన్యవంతం చేసేందుకు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, సర్పంచులు జాన స్వరూపా గోపి, అత్తినేని గంగారెడ్డి, స్నేహలత, సామల్ల లావణ్య, ఎంపీటీసీలు మోర విజయ లక్ష్మీ వెంకటేశం, జాన సాగరికాగంగాధర్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ముఖీద్, టీఆర్ఎస్ రాయికల్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, నాయకులు కొల్లూరి వేణు, జోగినిపెల్లి తిరుపతి గౌడ్, అనుమల్ల మహేశ్, సాగర్ రావు, మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.