ఓదెల, నవంబర్ 29;ఓదెల.. ఇదో మారుమూల మండల కేంద్రం. అయితేనేమీ ఇక్కడి ప్రజల్లో చైతన్యం ఉంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 120 మంది నేత్రదాతలతో ఆదర్శంగా నిలుస్తున్నది. సదాశయ ఫౌండేషన్ కల్పించిన అవగాహనతో గ్రామ ప్రజలు నేత్రదానం ఎంత అవసరమో గుర్తించారు. తమ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత నేత్రాలు దానం చేసి గొప్ప మనసు చాటుకుంటున్నారు. –
ఓదెల మండలకేంద్రంలో ప్రైవేట్ వైద్యుడిగా విధులను నిర్వర్తిస్తున్న మేర్గు భీష్మాచారితోపాటు మరి కొందరు 2015లో సదాశయ ఫౌండేషన్ ద్వారా మొదటగా నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. అక్కడితో ఆగకుండా అవయవదానం, ప్రత్యేకంగా నేత్రదానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరిస్తారు. మొదట్లో ఒక్కో దగ్గర చీత్కారాలు, తిట్లు ఎదురయ్యాయి. అయినా, వెరవకుండా ప్రజల్లో మూఢవిశ్వాసాలను తొలగించే ప్రయత్నం చేశారు. చనిపోయిన వారి కండ్లను పూర్తిగా తీసుకుని పోతారనే అపనమ్మకాన్ని తొలగించి, కేవలం కార్నియా మాత్రమే తీసుకెళ్లనున్నట్లు వివరించారు.
దీంతో ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరు చనిపోయినా మొదట సదాశయ ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించి వారే తమ వారి నేత్రాలను దానం చేస్తామంటున్నారు. అలాగే, నేత్రాలను దానం వారి ఇంటిలో దశదినకర్మ రోజు సదాశయ ఫౌండేషన్ తరఫున సంస్మరణ సభ ఏర్పాటు చేస్తూ నేత్రదానం గురించి మరింత మందికి అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా, మృతుల కుటుంబ సభ్యులను సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేసి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దీంతో పాటు సదాశయ ఫౌండేషన్ ప్రత్యేకంగా కరపత్రాలను, జీవ ప్రదాతలు అనే పుస్తకాన్ని 200 పేజీలతో ముద్రించి అవగాహన కల్పిస్తున్నారు. కళ్లను దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేలా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు టీ శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
నేత్రదానం ఎవరు చేయాలి?
నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. కళ్లజోడు పెట్టుకునే వారు, అధిక బ్లడ్ ప్రెషర్, మధుమేహం, ఉబ్బసం వ్యాధులతో ఉన్న వారు కంటి శుక్లాను (కెటరాక్టు) ఆపరేషన్ చేయించుకున్న వారు సైతం నేత్రదానం చేయవచ్చు.
ఇవి పాటించాలి
వ్యక్తి మరణించిన 6 గంటలలోపు నేత్రాలను తీయాలి. సకాలంలో దానం జరిగేలా చూడాలి. కంటి బ్యాంక్ డాక్టర్ గానీ, శిక్షణ పొందిన టెక్నీషియన్ మాత్రమే స్టెరైల్ పద్ధతి ద్వారా కార్నియాను బయటకు తీస్తారు.
మా నాయిన కళ్లను దానం చేసినం
మా నాయిన సమ్మయ్య 2016లో అనారోగ్యంతో చనిపోయిండు. మా ఊళ్లెనే ఉండే ప్రైవేట్ డాక్టర్, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మాచారి వచ్చి కళ్ల దానం గురించి చెప్పిండు. కళ్లు వట్టిగ మట్టిల పోవుడు ఎందుకని కళ్లను దానం చేసినం. మా నాయిన కళ్లు ఇద్దరికి చూపునిత్తున్నయంటే మంచి జరిగినట్టే కదా. మా ఊళ్లో ఎవరు చనిపోయినా కళ్లను దానం చేసే సాంప్రదాయం కొనసాగుతున్నది.
– కుక్కల కృష్ణ, చిరువ్యాపారి (ఓదెల)
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నం
అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా కళ్లదానం వల్ల జరిగే లాభాలను వివరిస్తున్నాం. ఒకరు మరణిస్తే మరో ఇద్దరికి కంటి చూపు ఇవ్వచ్చని చెప్తే చాలా వరకు ప్రజల్లో స్పందన వస్తున్నది. అందుకే ఒక్క ఓదెలలోనే ఏడేళ్లలో 120 మంది చనిపోగా వారి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వారికి సంస్మరణ సభలు నిర్వహించి మిగతావారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాం. గ్రామంలో ఎవరు చనిపోయినా వెంటనే మాకు సమాచారం ఇచ్చి కళ్లుదానం చేస్తామని చెబుతున్నారు.
– మేర్గు భీష్మాచారి, సదాశయ ఫౌండేషన్ (పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు)