కార్పొరేషన్, నవంబర్ 28: పచ్చని తెలంగాణలో చిచ్చురేపాలని, వైషమ్యాలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తున్నదని కరీంనగర్ మేయర్ సునీల్రావు ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నించడం బాధాకరమని దుయ్యబట్టారు. దేశం లో మరే రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నదని, కానీ ఓర్వలేని కేంద్రం అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్రం ఇంత వివక్ష చూపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో అభివృద్ధి చేసుకుంటున్నదని చెప్పారు. సంక్షేమంలో తెలంగాణ ముందున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు మచ్చుకైనా కానరావని, అది వాళ్ల పనితీరు అని ఎద్దేవా చేశారు. ఎప్పటికీ రాలేని అధికారం తమ కు వస్తుందన్న ఆశతో బీజేపీలో మూడు గ్రూపు లు.. ఆరు వర్గాలు అన్నట్లుగా ఎవరికి వారుగా హింసా ద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గత నాలుగేళ్లలో ఏ రోజైనా కేంద్రం ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడారా..? అని నిలదీశారు. ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల మాట ఏమో గానీ ఉన్న ఉద్యోగులనూ కేంద్రం తొలగిస్తుంటే ఎంపీగా ఈ రోజుకూ బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)భిక్షతో నాయకుడిగా ఎదిగి, సీఎం కేసీఆర్ దయతో పదవులు పొందిన ఈటల రాజేందర్ ఇపుడు అదే పార్టీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్థిని పెట్టుకొని గెలిచిన విషయం అందరికీ తెలుసన్నారు. ఈటలకు టీఆర్ఎస్పై మాట్లాడే అర్హత లేదన్నా రు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రెచ్చగొట్టే మాటలు మానుకొని కేంద్రం నుంచి ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి చూపించారో ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ సడక్ యోజ న, ఉపాధి హామీ వంటి పథకాలు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి తెచ్చినా పథకం ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ పా ర్లమెంట్ సభ్యుడిగా ఏం చేశారో చెప్పాలన్నారు. యాత్రల పేరుతో కాలయాపన చేయడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం తప్ప చేసేదేం లేదని ఆరోపించారు. మంత్రి గంగుల, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రత్యేక చొరవతో కరీంనగర్కు వందల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలోనూ నాలుగు మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తే వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఇ చ్చారా..? అని నిలదీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంట పొలాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. బీజేపీ నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్చార్జిగా నియమించారని, వీరంతా తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మూడు సార్లు సీఎంగా చేసిన గుజరాత్తో కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు, ప్రయత్నాలు చేసినా నడువయని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా, ఎంపీ స్థానాలను టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుచుకోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కార్పొరేటర్లు గంట కల్యాణి, కంసాల శ్రీనివాస్, బండారి వేణు, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, గందె మాధవి, తోట రాములు, ఐలేందర్యాదవ్, నాంపెల్లి శ్రీనివాస్, నాయకులు కాశెట్టి శ్రీనివాస్, మేచినేని అశోక్రావు, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, హబీబ్, అనిల్కుమార్, బాలరాజ్ పాల్గొన్నారు.