చిగురుమామిడి, నవంబర్ 28 : మండలంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1.06 లక్షల క్వింటాలు ధాన్యం కొనుగోలు చేశామని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పాస్ ఆధ్వర్యంలో 12 గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను సోమవారం వైస్ చైర్మన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు రైతులకు రూ.5.17 కోట్లు నగదు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కృషితో మండలంలోని గ్రామాలకు గోదావరి జలాలు రావడంతోనే చెరువులు, కుంటలు నుంచి ధాన్యం దిగుబడి ఎకువగా వచ్చిందన్నారు. వీరి వెంట సింగిల్ విండో వైస్చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, సీఈవో కాటం నర్సయ్య, రైతులు ఉన్నారు.