కలెక్టరేట్, నవంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లను సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతి, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు, పోడు భూములు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 18,328 కోట్లతో 2.91 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, పేదలకు పంపిణీ చేసేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ను రూపొందించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 26 వేల ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. తుది దశలో ఉన్న ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో పారదర్శకంగాఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇండ్లు పొందిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీల్లో 18 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్, ఇతర వసతుల కల్పనకు రూ. 205 కోట్లు మంజూరు చేశామని, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వేగం పెంచాలని, ప్రతి నెల పురోగతిపై రివ్యూ నిర్వహిస్తామని, జనవరి 15వ తేదీ నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాకు 6494 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. 2769 ఇండ్ల పనులు ప్రారంభించగా, 1177 పూర్తయ్యాయని, 438 ఇండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి నతానియేల్, డీఆర్డీవో అధికారి శ్రీలత, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.