కోరుట్ల, నవంబర్ 22: స్వరాష్ట్రంలో దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు మంజూరైన ట్రై సైకిళ్లను అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా 3,016 పింఛన్ అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నదన్నారు. స్కూటీలు, ట్రైసైకిళ్లను కూడా అందిస్తున్నదన్నారు.
ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, ప్రజల ముంగిటికి వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఏఎన్ఎంలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్తో బాధ పడుతున్న వారిని గుర్తించి, వీరికి ప్రతి నెలా మందులు ఉచితంగా ఎన్సీడీ కిట్లు అందిస్తున్నారని తెలిపారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే నాయకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, ఎంపీపీ తోట నారాయణ, మెట్పల్లి మున్సిపల్ అధ్యక్షురాలు రానవేణి సుజాత, కోరుట్ల మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, మల్లాపూర్ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వైద్యాధికారులు అశోక్ కుమార్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.