కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘మీరు అధికారులు కాదు కదా.. ఇక్కడ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా.? అధికారులు ఎందుకు రాలేదు.. మీరు ఎందుకు వచ్చారు. దయచేసి వెళ్లిపోండి’ అంటూ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వివిధ స్థాయీ సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధికారులకు బదులు సీనియర్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అధికారులకు బదులు ఏఈలు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి సైతం డివిజన్ స్థాయి అధికారులు హాజరవుతారని, జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం అంతకన్నా అధ్వానమా? అని మండిపడ్డారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈకి బదులు ఏఈ, మైనింగ్ శాఖ ఏడీకి బదులు ఆర్ఐ, ఆర్టీసీ ఆర్ఎంకు బదులు పీఆర్వో, సహకారశాఖ అధికారికి బదులు కార్యాలయ సిబ్బంది హాజరుకావడంపై జడ్పీ చైర్పర్సన్ వేర్వేరు సమయాల్లో అసహనం వ్యక్తం చేశారు. వారితో చర్చ జరుపలేదు. అధికారుల తీరుపై తమ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై కఠినంగా వ్యవహరించాలని జడ్పీ సీఈవో ప్రియాంకను ఆదేశించారు. జడ్పీ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
రోడ్లన్నీ నాశనం చేస్తున్నరు
రోడ్లు, భవనాల శాఖ అధికారులు నివేదిక సమర్పించిన సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ విజయ మరోసారి జోక్యం చేసుకున్నారు. జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక లారీలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ఓవర్ లోడ్తో వాహనాలు నడుపుతున్నారని ఆర్అండ్బీ అధికారులు జడ్పీ చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలో రోడ్లన్నీ నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పారిశుధ్య పనులపై జరిగిన చర్చలో చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని డీపీవో వీర బుచ్చయ్య దృష్టికి తెచ్చారు. పారిశుధ్య పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని జడ్పీ చైర్పర్సన్ డీపీవోను ఆదేశించారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐలు సకాలంలో చెల్లించేలా చూడాలని జడ్పీ సీఈవో ప్రియాంక డీపీవోకు సూచించారు. మిషన్ భగీరథపై జరిగిన చర్చలో హుజూరాబాద్ జడ్పీటీసీ బక్కారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీలు కేబుల్ విస్తరణ కోసం తవ్వుతున్న కందకాలతో మిషన్ భగీరథ పైప్లైన్లు దెబ్బతింటున్నాయని, వాటికి మరమ్మతులు చేయకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు.
పైప్లైన్ నిర్వహణ గ్రిడ్లో లేదని, గ్రామ పంచాయతీలు చేసేలా చూడాలని సంబంధిత అధికారులు జడ్పీ చైర్పర్సన్ను కోరారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామం మినహా అన్ని గ్రామాల్లో ట్యాంక్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఈ గ్రామంలో పైప్లైన్ విస్తరణకు స్థానిక పంచాయతీ తీర్మానం ఇవ్వడం లేదని అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. పశుసంవర్ధక శాఖపై జరిగిన చర్చలో దళితబంధు కింద పాడి యూనిట్లు ఎంచుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్పర్సన్ సూచించారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు గురించి ఉద్యానవన శాఖ అధికారి స్వాతి వివరించారు. పది వేలకుపైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, చిగురుమామిడిలో నర్సరీ ఏర్పాటు చేశామని, ఏడాది వయసు ఉన్న మొక్కలను జనవరి నుంచి రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 714 మంది రైతులు 2,200 ఎకరాల్లో సాగు చేయడానికి ముందుకు వచ్చారని, 985 ఎకరాలకు డీడీలు కూడా వచ్చినట్లు తెలిపారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.193 ఉంటుందని, రైతుల నుంచి మొక్కకు రూ.20 చొప్పున డీడీలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సభ్యులు కోరారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘాల సమావేశాల చైర్మన్లు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. మిగతా ఐదు సంఘాల సమావేశాలు ముగిశాయి.