మానకొండూర్, నవంబర్ 19: ‘తెలంగాణ పోరాటంలో మహిళలను జాగృతం చేసిన ఎమ్మెల్సీ కవితపై హద్దుమీరి మాట్లాడితే బుద్ధి చెప్తం. మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఆడబిడ్డపై ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నం’ అంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహులకు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే అర్హతలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దీటుగా బదులిస్తామని తేల్చిచెప్పారు.
అర్వింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీ(బీ)ఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నాయకులు హేళన చేస్తూ మాట్లాడితే ఊరుకోబోమన్నారు. ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన వారు ఉద్యమ నేపథ్యమున్న కేసీఆర్ కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నత ఉద్యోగాలను వదులుకొని ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు.
అర్వింద్.. తెలంగాణ పోరాటంలో నీ పాత్ర ఏది? ఉద్యమ సమయంలో ఎక్కడున్నవ్? ఏనాడైనా పాల్గొన్నవా? నీ కుటుంబం చేసిన త్యాగమేంది? ఎంపీ కాకముందు నీ చరిత్ర ఏంది? తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత మీ నాన్నకు సీఎం కేసీఆర్ పదవిచ్చి గౌరవించారని గుర్తుచేశారు. ఇవన్ని మరిచిన అర్వింద్ సంస్కారహీనంగా వ్యవహరించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కనీసం డిపాజిట్ కూడా రాదని తేల్చి చెప్పారు.
నియోజకవర్గంలో అభివృద్ధ్ది జరగలేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. వారికి కళ్లు ఉంటే గన్నేరువరం మండలంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ మండలం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
జీవీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమెపై నోటికచ్చినట్లు మాట్లాడిన అర్వింద్ను రెండు చెప్పులతో కొట్టినా తప్పులేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, నాయకులు రామంచ గోపాల్రెడ్డి, దండు మనోజ్, పిట్టల మధు, నెల్లి మురళి, శాతరాజు యాదగిరి, పారునంది కిషన్, ఉండిం టి శ్యాంసన్, పుళ్లూరి శ్రీనివాస్, కనుకుంట్ల అభిలాష్, కనుకం అశోక్ పాల్గొన్నారు.