కమాన్చౌరస్తా, నవంబర్ 11: జిల్లాలో ‘మన ఊరు-మన బడి, మన ఊరు-మన బస్తి’ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె విద్యాశాఖ అధికారులతో పాటు ఏఈలు, డీఈఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 14వ తేదీలోగా ప్రతి మండలంలో మూడు పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఆదేశించారు. పెయింట్కు సిద్ధంగా 52 పాఠశాలల్లో పనులు పూర్తిచేయాలన్నారు. డైనింగ్ హాల్స్, కిచెన్ షెడ్లు, టాయ్లెట్లు పూర్తిచేయాలని, అవసరమైన చోట గ్రిల్ పెట్టించాలని సూచించారు.
అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాలో ఉపాధ్యాయులు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో (ఎఫ్ఎల్ఎన్) ఫౌండేషనల్ లిట్రసీ న్యూమరసిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అక్షరాస్యత సంఖ్యను పునాది నుంచి బలోపేతం చేయడంలో భాగంగా అధికారులు నూతన అభ్యసన సామర్థ్యాలను అవలంబించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అన్నిసబ్జెక్ట్ల్లో మంచి ప్రతిభ కనబరచడంతో పాటు చదవడం, రాయడం, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించేలా కృషి చేయాలన్నారు. ప్రతినెల ఒకటో తేదీన బడిబాట కార్యక్రమం, 3వ శనివారం పెరేంట్స్ మీటింగ్స్ నిర్వహించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ ఫలితాలను వెంటవెంటనే ఆన్లైన్లో పొందుపర్చాలని, అర్హులందరికీ ప్రీ-మెట్రిక్ సాలర్ షిప్లు అందేలా చూడాలన్నారు. అతి తకువ ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాన్ని చూపిన జమ్మికుంట ప్రధానోపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నతానియేల్, సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.