జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 22: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం యూనిట్లను లబ్ధిదారులకు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం దళిత బంధు పథకం తీరుతెన్నలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో యూనిట్లు అందించామని, మొదటి దఫా కింద 35 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. దళిత కుటుంబాలను కలువాలని, ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. దీపావళిలోగా మొదటి విడుత లబ్ధిదారుల యూనిట్లు పూర్తి చేయాలని చెప్పారు.
రెండో విడుతలో సగం డబ్బులు పొందిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని, మిగిలిన సగం డబ్బుల విడుదల కోసం లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించిన పూర్తి వివరాలు పథకం యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న 16 మంది కొటేషన్లు అందించలేదని, కొటేషన్లు ఇచ్చేలా చూడాలని సూచించారు. పథకానికి అర్హులను, లబ్ధిదారుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. పథకం అమలు చేయడంలో క్లస్టర్ అధికారులు, సిబ్బంది పనితీరు బాగా ఉందని ప్రశంసించారు. మరింత సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.
వార్డులు.. క్లస్టర్ వారీగా దళిత కుటుంబాలు, దళిత బంధు పథకం అమలు, ఇంకా అమలు చేయాల్సిన కుటుంబాలు, పథకం అమలుకు తీసుకోవాల్సి చర్యలు, తదతర అంశాలపై చర్చించారు. అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కమిషనర్ సమ్మయ్య, క్లస్టర్ అధికారులు లింగారెడ్డి, నవీన్కుమార్, రాజవీరు, వెంకటేశ్వర్లు, మేనేజర్ భూపాల్రెడ్డి, 32 వార్డులకు చెందిన మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.