రేపటి గ్రూప్-1 ప్రిలిమినరీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం నిర్వహించే ఈ ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాలుగు జిల్లాలో మొత్తం 34,045 మంది పరీక్ష రాయనుండగా, 89 సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాక మునుపు ఉమ్మడి జిల్లాకేంద్రాల్లోనే రాసే అవకాశముండగా, స్వరాష్ట్రంలో మొదటిసారి కొత్త జిల్లా కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం ఏర్పడింది. దీంతో అభ్యర్థులకు దూర, వ్యయ భారం తప్పనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అయితే అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 10.15 గంటలు దాటితే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రిలిమ్స్కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే ప్రత్యేక కంట్రోల్రూం నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం ఖుస్రోషాఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల నుంచి ఆయా సెంటర్లకు బస్సులను నడుపుతామన్నారు.
– కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
హాల్టికెట్పై ఫొటో, సంతకం లేకుంటే ఏం చేయాలి?
హాల్టికెట్పై ఫొటో, సంతకం స్పష్టంగా కనిపించేలా ఉండాలి. అందుకోసం హాల్ టికెట్ను ఏ-4 షీట్ పైన ప్రింట్ తీసుకోవాలి. కలర్ ప్రింట్ అయితే మంచిది. ఒక ఒకవేళ హాల్టికెట్పై ఫొటో సరిగా లేకపోయినా..? ఫొటో అసలు ప్రింట్ కాకపోయినా..?
గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. మూడు పాస్పోర్టు సైజు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. ఆ ధ్రువీకరణ పత్రాన్ని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు సమర్పించాలి. అప్పుడే పరీక్షకు అనుమతిస్తారు. హాల్టికెట్ డౌన్లోడ్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు
టీఎస్పీఎస్సీ హెల్ప్డెస్క్
040 23542185 / 23542187 నంబర్లకు కాల్ చేయాలి.
లేదా టీఎస్పీఎస్సీకి helpdesk@tspsc.gov.in
మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను సంప్రదించవచ్చు