తెలంగాణచౌక్, అక్టోబర్ 10: ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టి దళితులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు.. దేశంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందువులనే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. హిందుత్వ వాదం తమ హకు అని చెప్పుకునే బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించడం లేదని ప్రశ్నించారు. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్లు ఇవ్వకపోగా, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
బీసీ అని చెప్పుకునే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.18 వేల కాంట్రాక్టు పనుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశంలో ప్రశ్నించేవారు ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం తమ చేతిలో ఉన్న ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే బడుగు, బలహీన వర్గాలు, రైతులు బాగుడుతారని తెలిపారు. ఆయనవైపు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నరని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, మరి జన సంఘ్ను బీజేపీగా మార్చుకుంటే తప్పు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ముందు వారి పార్టీ చరిత్ర తెలుసుకోవాలని హితవుపలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 15న జంతర్ మంతర్ వద్ద నిరసన, 16న దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, నాయకులు, పార్లమెంటు సభ్యులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, రాష్ట్ర నాయకులు సుద్దాల లక్ష్మణ్, గజ్జెల ఆనందరావు, ఉపాధ్యక్షుడు కల్వల ఆనంద్, తాండ్ర శంకర్, తాటిపల్లి ప్రభు, శంకర్, స్వరూప, ఎస్కే సుల్తానా తదితరులు పాల్గొన్నారు.