ఉత్తర భారతాన్ని వణికిస్తున్న లంపీస్కిన్ డిసీజ్ కరీంనగర్ జిల్లాకు పాకింది. ఇప్పటికే 16 పశువులకు సోకి, రైతులను వణికిస్తున్నది. ఈ వ్యాధి తీవ్రతలో ఉత్తరాదికి ఇక్కడికి తేడా ఉన్నప్పటికీ, జీవాలు నీరసించి బక్కచిక్కి పోయే ప్రమాదం ఉండడంతో పశుసంవర్ధకశాఖ నివారణ చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 9,636 పశువులకు ముందస్తుగా వ్యాక్సిన్ ఇవ్వడంతో చేయడంతోపాటు పశువుల అంగళ్లు, రవాణాపైనా ఆంక్షలు విధించింది. ఇటు తెలుపు రంగు పశువులపై ఎక్కువగా ప్రభావం చూపుతుండడం, దోమలు, గోమార్లు, పిడుదుల, జోరీగల ద్వారా ఒక జీవం నుంచి మరో జీవానికి సంక్రమిస్తుండడంతో ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు బెంగళూర్లోని ఐసీఏఆర్ సంస్థ కూడా చర్యలు చేపట్టింది.
కరీంనగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): లంపీస్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) ఇది ఒక పశువు నుంచి మరో పశువుకు సులువుగా సంక్రమిస్తుంది. జోరిగలు, దోమలు, గోమార్లు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. ఇది ఉత్తరాది రాష్ర్టాలను వణికిస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వేల పశువులు ఈ వ్యాధి కారణంగా మృత్యువాతపడ్డట్లు తెలుస్తున్నది. దీన్ని బట్టి ఈ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యాధి సోకిన పశువులో తీవ్రమైన జ్వరం, కండ్లు, ముక్కు నుంచి ఎక్కువగా సొల్లు కారడం, చర్మంపై 1-5 సెంటీ మీటర్ల పరిమాణంలో దద్దుర్లు రావడం, పాడి పశువులైతే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వంటి ప్రధాన లక్ష్మణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగిన కొద్ది శ్వాస వ్యవస్థ దెబ్బతిని పశువులు మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులు 5 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. నల్ల పశువులు అంటే బర్రెల కంటే తెలుపు రంగు పశువులైన ఆవులు, ఎడ్లపైనే ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది
ప్రశ్న: లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి) అంటే ఏమిటి.? ఎలా సోకుతుంది.
జవాబు – ఇది పెద్ద పశువుల్లో మాత్రమే సోకే ఒక రకమైన చర్మవ్యాధి. ఇది ‘అమ్మతల్లి’ రకానికి చెందిన ఒక సూక్ష్మజాతి. సూక్ష్మమైన క్రిమి (వైరస్) ద్వారా సోకుతుంది.
ఈ వ్యాధి గొర్రెలు, మేకలు, కుక్కల్లో కూడా ఉంటుందా..?
గొర్రెలు, మేకలు, కుక్కలకు సోకదు.
ఆవులు, గేదెలలో కూడా సోకుతుందా..?
ఆవులు, గేదెలలో కూడా సోకినప్పటికీ, ఆవులో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది..
పశువుల ద్వారా మనుషులకు కూడా సోకుతుందా..?
ఇది జూనోటిక్ వ్యాధి కాదు. దీనిబారిన పడ్డ పశువుల ద్వారా మనుషులకు సోకదు.
వ్యాధి సోకిన ఆవులు, బర్రెల నుంచి సేకరించిన పాలను మనుషులు తాగవచ్చా..? తాగితే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా..?
వేడి చేసి చల్లార్చిన పాలను ఎటువంటి అనుమానం లేకుండా తాగవచ్చు. పచ్చిపాలను మాత్రం తాగ కూడదు. వేడి చేసి చల్లార్చిన పాలను, లేగలు, దూడలకు కూడా పట్టించవచ్చు.
మన దేశంలో ఈ వ్యాధిని మొదటి సారి ఎక్కడ కనిపెట్టారు..?
– 2019లో ఈ వ్యాధి మొదటి సారి ఒడిశా రాష్ట్రంలో గుర్తించారు. 96 ఏండ్ల కిందనే ఈ వ్యాధిని ఆఫ్రికా ఖండంలో గుర్తించినప్పటికీ గత మూడేళ్ల నుంచి మాత్రమే మన దేశంలో గుర్తించడం జరింది. ఇప్పటికే 24 రాష్ర్టాల్లో ఈ వ్యాధిని గుర్తించారు.
వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి..?
– వెంటనే సమీప పశువైద్యాధికారిని సంప్రదించాలి. సొంత వైద్యం చేయకూడదు.
వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి..?
మేకలలో వచ్చే అమ్మతల్లి రోగాన్ని కలగజేసే వైరస్కి ఈ వైరస్ కారకానికి దగ్గరి పోలికలు ఉన్నాయి. మేక తల్లి రోగ టీకాలను పెద్ద పశువులకు కూడా ఇచ్చినట్లయితే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సలహాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఒకసారి వ్యాధి సోకి తగ్గిన పశువుకు ఈ వ్యాధి మళ్లీ సోకే ప్రమాదం ఉందా..?
– అలాంటి అవకాశం లేదు.
రోగం సోకిన తర్వాత వాటికి మేక తల్లి రోగ నిరోధక టీకాలు వాడితే ప్రయోజనం ఉంటుందా..?
– ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే టీకాలు ఇవ్వాలి. రోగం వచ్చిన తర్వాత అవి పని చేయవు. 3,4 నెలల వయసు ఉన్న వాటికి కూడా టీకాలు ఇచ్చి ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.
వ్యాధి సోకిన పశువు నుంచి టీకాలు ఇవ్వని పశువులను ఎలా కాపాడుకోవాలి..?
వ్యాధి సోకిన పశువును ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచి దూరంగా ఉంచి, వైద్యం చేయించాలి. ఈ వ్యాధిని వ్యాపింపజేస్తున్న దోమలు, ఈగలు, గోమార్లు వంటి బాహ్య పరాన్న జీవులు పశువులపైనగానీ, పరిసరాల్లోగాని లేకుండా చూసుకోవాలి. టీకాలు ఇవ్వని పశువులకు వెంటనే మేకతల్లి వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలి.
– ఒక పశువు నుంచి ఇంకో పశువుకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి బారిన పడ్డ పశువును కుట్టిన దోమలు, ఈగలు, గోమార్లు, పిడుదుల (రక్తం పీల్చే బాహ్య పరాన్న జీవులు) ద్వారా వస్తుంది. కలుషితమైన మేత, నీరు, వీర్యం ద్వారా కూడా సోకే ప్రమాదం ఉంది. ఈగలు, దోమల ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
లంపీస్కిన్ వ్యాధి సోకిన పశువులతో మనుషులకు కూడా ప్రమాదం ఉంటుందని, పశువుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి అలాంటి పరిస్థితి ఉండదని పశు సంవర్ధక శాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అంతే కాకుండా బెంగళూర్ (నివేది)లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎపిడెమియాలజీ డిసీజ్ ఇన్ఫర్మెటిక్స్ సంస్థ శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేసి ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఈ ఇన్స్టిట్యూట్లోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జీబీ మంజూనాథ్రెడ్డి రైతుల్లో నెలకొన్న అనేక అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రశ్నావళిని రూపొందించి జవాబులు సిద్ధం చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యాధి సోకిన తర్వాత 1-5 వారాల మధ్యలో కనిపిస్తాయి. మరణాల శాతం 5 శాతానికి మించనప్పటికీ మందలో 40 శాతం పశువుల దాకా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదమున్నది. వ్యాధి సోకిన పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. కాళ్లు, పొట్ట భాగంలో నీరు చేరుతుంది. కీళ్ల వాపుతో పశువు సరిగా నిలబడ లేదు. 1-5 సెంటీ మీటర్ల వెడల్పుతో చర్మం మీద ముద్దలు ముద్దలుగా దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం మొదలైన 1-2 రోజుల నుంచి చర్మం మీద లక్షణాలు కనిపిస్తాయి. చూడి పశువులు ఈడ్చుకుపోతాయి. వ్యాధి ఎక్కువగా సోకిన పశువులకు సరైన చికిత్స అందించినప్పటికీ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. చర్మం మీద మచ్చలు మాత్రం చాలా కాలం వరకు అలాగే ఉంటాయి.
ఉత్తరాది రాష్ర్టాల మాదిరిగా తీవ్రత లేక పోయినా ఈ వ్యాధి కరీంనగర్ జిల్లా వరకు వ్యాపించింది. 16 పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించిన పశు సంవర్ధక శాఖ అధికారులు, దీని నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 13 గ్రామాల్లో ప్రభావం కనిపించినట్లు చెబుతున్నారు. అయితే ఉత్తర భారతానికి ఇక్కడికి వ్యాధి తీవ్రతలో తేడా ఉన్నందున పశువులు ఇప్పటి వరకు మృత్యువాత పడలేదు. అయినా వ్యాధి బారిన పడిన పశువును గుర్తించి, చుట్టు పక్కల 5 కిలోమీటర్ల మేర దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చుట్టు పక్కల ఉండే పశువులకు ముందుగానే గోట్ పాక్స్ నివారణ వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
70 నుంచి 80 శాతం ఈ వ్యాక్సిన్ పశువులను సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పటి వరకు 9,636 పశువులకు ముందస్తుగా వ్యాక్సిన్ వేశారు. అంతేగాకుండా పశువుల అంగళ్లు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రవాణాపైనా ఆంక్షలు విధించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించిన పశువును 15 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పశువుల రవాణాను నియంత్రించేందుకు చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు కింద డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు కూడా ప్రస్తుతం పాడి పశువులను గ్రౌండింగ్ చేయడం లేదు.
లంపీస్కిన్ డిసీజ్ అనేది అంత ప్రమాదకారి కాకున్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కేవలం 16 పశువుల్లో మాత్రమే ఈ వ్యాధి కనిపించింది. ఈగలు, దోమల ద్వారా వ్యాపించే ప్రమాదం ఉన్నందున కేసులు నమోదైన పాయింట్ నుంచి చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర గోట్ వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఇది ముందస్తు జాగ్రత్తల్లో భాగం. ఇతర రాష్ర్టాల నుంచి ఈ వ్యాధి రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే పశువుల రవాణాను తాత్కాలికంగా నిషేధించింది. ఒక వేళ రవాణా జరిగితే పశువులకు 15 రోజుల క్వారంటైన్ విధిస్తున్నాం. పశువైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి వ్యాధి లేదని నిర్ధాంచిన తర్వాతనే ఇక్కడి పశువుల్లో కలవనిస్తున్నాం. సాధ్యమైనంత వరకు పశువుల సంతలు కూడా తగ్గిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో ఈ వ్యాధి కారణంగా పశువులు మరణించలేదు.
– బండారి నరేందర్, పశు సంవర్ధక శాఖ జేడీ (కరీంనగర్)