మణుగూరు రూరల్, జనవరి 20: మణుగూరు ఏరియా మరో మైలురాయిని చేరుకుంది. బొగ్గు వెలికితీత, తరలింపులో రికార్డు సాధించింది. 100 లక్షల టన్నులకు పైగా బొగ్గు రవాణా చేసి సింగరేణి వ్యాప్తంగా మొదటిస్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైలు, రోడ్డు, రోప్వే ద్వారా 100 లక్షల టన్నుల బొగ్గును తరలించి మైలురాయిని అధిగమించింది. సింగరేణి వ్యాప్తంగా తరలించిన బొగ్గులో మణుగూరు నుంచే 19.3 శాతం నమోదైంది. దీంతో సింగరేణి అధికారులు, కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నిరుడు కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ అధికారుల ప్రత్యేక చర్యల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రా రంభంలో క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో బొగ్గు వెలికితీత, తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన ఏరియా అధికారులు.. సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఏరియాలోని 2,763 మంది ఉద్యోగులు ఓసీ-2, ఓసీ-4, మణుగూరు ఓసీ, కేపీయూజీ మైన్ల నుంచి బొగ్గు వెలికితీశారు. కేసీహెచ్పీ ద్వారా బొగ్గును రోడ్డు, రైలు, రోప్వే మార్గాల ద్వారా తరలించారు. ఆటంకం ఏర్పడకుండా పూర్తిస్థాయి, యంత్ర సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. జనవరి 19 నాటికి భద్రాద్రి థర్మల్ పవర్స్టేషన్కు, ఇతర సిమెంట్ కంపెనీలకు రోడ్డు మార్గం ద్వారా 31.95 లక్షల టన్నులు రవాణా చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాల్లోని విద్యుత్ ప్లాంట్లకు రైలు ద్వారా 63.82 లక్షల టన్నులను పంపారు. మణుగూరు (అశ్వాపురం) హెవీ వాటర్ప్లాంట్కు రోప్వే ద్వారా 4.44 ట న్నులు తరలించారు. దీంతో మొత్తం మణుగూరు ఏరియా నుంచి 100.21 లక్షల టన్నుల రవాణా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏరియా వార్షిక నిర్దేశిత లక్ష్యం 112 లక్షల టన్నులు కాగా, ఇప్పటి వరకు 96.97 లక్షల టన్నులు వెలికితీశారు. టార్గెట్ పూర్తి చేసేందుకు మరో రెండున్నర నెలల సమ యం ఉంది. అంతకుముందే లక్ష్యాన్ని అధిగమించి బొగ్గు ఉత్ప త్తి సాధిస్తామని అధికారులు చెబుతున్నారు.
సమష్టి కృషితోనే..
సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ల సూచనలతో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఏటా నిర్దేశిత వార్షిక లక్ష్యాలను సాధిస్తున్నాం. ఈసారీ ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణం. నాణ్యమైన బొగ్గు వెలికితీతతోపాటు తరలింపు చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సమష్టి కృషితోనే 100 లక్షల టన్నుల బొగ్గు తరలింపు సాధ్యమైంది. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలి. కేసీహెచ్పీ అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
కార్మికుల నిబద్ధత వల్లే..
ఏరియా జీఎం రమేశ్ దిశానిర్దేశం మేరకు మణుగూరు ఏరియా కార్మికులు నిబద్ధత, సమష్టి కృషితో పనిచేయడం వల్లే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైంది. జనవరి 19 నాటికి 100 లక్షల టన్నులకు పైగా బొగ్గు తరలించి మణుగూరు ఏరియా రికార్డు నమోదు చేసుకోవడం గర్వకారణం. సూపర్వైజర్లు, ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాలకు టీబీజీకేఎస్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు.
అంకితభావంతోనే..
అంకితభావంతో పనిచేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని తెలిపేందుకు మణుగూరు ఏరియా ఒక ఉదాహరణ. అందుకే 100 లక్షల టన్నుల బొగ్గు తరలింపు సాధ్యమైంది. కార్మిక సంఘాలు, ఉద్యోగులకు అభినందనలు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో మున్ముందు మరెన్నో రికార్డులు సాధిస్తాం. మణుగూరు ఏరియాను సింగరేణి మొత్తంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం.