మెరుగైన వైద్యం అందించడమే కాదు, మరింత చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా దవాఖానను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. తాజాగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు నెలల క్రితం సిరిసిల్లకు రెండు బస్తీ దవాఖానలు మంజూరు చేయగా, అందులో ఒకటి రాజీవ్నగర్లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది అందుబాటులోకి వస్తే సేవలు సకాలంలో అందనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రోజురోజుకూ పట్టణాల పరిధి పెరుగుతున్నది. జనాభా కూడా అంతకంతకూ పెరుగుతున్నది. శివారు గ్రామాల విలీనంతో కొత్త పట్టణాలు కూడా ఏర్పడ్డాయి. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో ఎక్కడికక్కడే మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. అందులో భాగంగా 5వేల నుంచి 10వేల జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో సిరిస్లిలకు రెండు బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. అందులో రాజీవ్నగర్లో నిర్మించిన దవాఖాన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 16 పీహెచ్సీలు ఉన్నాయి. సిరిసిల్లలో 200 పడకలు, వేములవాడ పట్టణంలో 100 పడకల దవాఖానలో వైద్య సేవలందుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. పట్టణ శివారు గ్రామాల విలీనంతో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధి పెరిగింది. ఈ క్రమంలో కార్మిక క్షేత్రంలోని ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జిల్లా కేంద్రంలో రెండు బస్తీ దవాఖానలను మంజూరు చేశారు.
అందులో మొదటగా రాజీవ్నగర్లో 13 లక్షలతో బస్తీ దవాఖాన నిర్మించారు. అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. దవాఖానలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, కాంటిజెంటల్ వర్కర్, ఫార్మాసిస్టులుండేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే కలెక్టర్ అనురాగ్ జయంతి దవాఖానను సందర్శించారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖల పర్యవేక్షణలో నిర్వహించే రాజీవ్నగర్ బస్తీ దవాఖాన త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకాబోతున్నది.
వైద్యం చేరువ..
రాజీవ్నగర్లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానతో రాజీవ్నగర్, ముష్టిపల్లి, భూపతినగర్, చిన్నబోనాల ప్రజలకు వైద్యం మరింత చేరువ కానుంది. వీరంతా గతంలో వైద్యం కోసం కిలోమీటరున్నర దూరంలోని సుందరయ్యనగర్ అర్బన్ హెల్త్సెంటర్, లేదా రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ఏరియా దవాఖానలో వైద్యం కోసం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు బస్తీ దవాఖానతో దూరం తగ్గి వైద్యం సకాలంలో అందనున్నది.
మంత్రికి ధన్యవాదాలు
సర్కారు దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. కార్పొరేట్కు ధీటుగా మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్మిక క్షేత్రంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షణీయం. రాజీవ్నగర్ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెస్తున్న మంత్రికి ధన్యవాదాలు. నెహ్రూనగర్, బీవైనగర్, సాయినగర్, ఇందిరానగర్ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే మంత్రికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– చింతోజు భాస్కర్, మానేరు స్వచ్ఛంద స్వంస్థ అధ్యక్షుడు
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
స్థానిక యూపీహెచ్సీ రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యవసర సమయంలో అక్కడికి వెళ్లేందుకు స్థానిక ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఆటోలు దొరుకవు. ఈ పరిస్థితిని మంత్రి కేటీఆర్కు వివరించాం. బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మంజూరు చేశారు. రూ.13లక్షలతో సకల వసతులతో నిర్మించారు.
– అలువాల ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ కమిటీ సహాయ కార్యదర్శి (రాజీవ్నగర్)