వేములవాడ, ఆగస్టు18: వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. చిన్న గొడవకు సంబంధించి నమోదైన కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు హెడ్కానిస్టేబుల్ చంద్ర ప్రకాశ్ రూ.10వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఠాణా సమీపంలో బాధితుడి నుంచి సదరు అధికారి డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ వీధిలో వేముల భరత్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన పక్కనే ఉన్న ఓ ముస్లిం వ్యాపారితో వ్యాపారం విషయంలో కొద్దిరోజుల క్రితం మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో భరత్ ఈ నెల 8న పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తిపై కేసు నమోదైంది.
అయితే సదరు వ్యాపారి కూడా ఫిర్యాదు చేయడంతో భరత్పైనా కేసు ఫైల్ అయింది. మరుసటి రోజు భరత్కు 41ఏ సీఆర్పీపీ కింద నోటీసు ఇచ్చారు. అయితే భరత్ కేసుకు అధికారిగా ఉన్న హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్.. స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ.10వేలు కావాలని భరత్ను డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని, వ్యాపారం కూడా నడుస్తలేదని భరత్ ప్రాదేయపడ్డాడు.
అయినా చంద్రప్రకాశ్ వినకపోవడంతో భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత చంద్రప్రకాశ్ వద్దకు వెళ్లిన భరత్.. తాను అంత ఇచ్చుకోలేనని, రూ.6వేలు ఇస్తానని చెప్పాడు. గురువారం పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వద్ద భరత్ నుంచి హెడ్ కానిస్టేబుల్ రూ.6వేలు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ భద్రయ్య బృందం రెడ్హ్యండెడ్గా పట్టుకుంది. చంద్రప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు రాము, ఎస్పి రవీందర్, తిరుపతి, జాన్రెడ్డి ఉన్నారు.
నాషాపు పక్కన ఉండే వ్యాపారితో నాకు గొడవైంది. నన్ను కొట్టేందుకు రావడంతో వారిపై వే ములవాడ ఠాణాలో ఫిర్యాదు చేశా. వారిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తి కూడా వచ్చి ఫిర్యాదు చే యడంతో నాపైనా కేసు నమోదైంది. స్టేషన్ బెయి ల్ ఇప్పిస్తానని రూ.10వేలు ఇవ్వాలని హెడ్కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. వ్యాపారం నడుస్తలేద ని, అంత ఇచ్చుకోలేనని చెప్పినా హెడ్కానిస్టేబుల్ వినలేదు. ఇచ్చి తీరాల్సిందేనని చెప్పేశాడు. చివరికి రూ.6వేలు ఇవ్వాలని అన్నాడు. గత్యంతరం లేక ఏసీబీ ఏసీబీ అధికారులను ఆశ్రయించా.
– వేముల భరత్, బాధితుడు