కార్పొరేషన్, ఆగస్టు 18: ఈ నెల 20, 21 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక అధికారులను నగర మేయర్ వై.సునీల్రావు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చొప్పదండి, గోదావరిఖని ఎమ్మెల్యేలకు సంబంధించి వివిధ ఫంక్షన్ల్కు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ నగరానికి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వెళ్లే రహదారులు, నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎలాంటి పారిశుధ్య, ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా నగరంలో సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడ సమస్యలు రాకుండా ఉండేందుకు వీలుగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగం, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులతో కూడిన ఐదు టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు చేసేలా చర్యలు తీసుకుంటాయని తెలిపారు. నగరంలోని అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ చెత్త పేరుకపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
నగరంలోని ప్రధాన రహదారులను రాత్రిళ్లు స్వీపింగ్ చేయడంతో పాటుగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే పుట్పాత్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని, తోపుడుబండ్లు, ఇతర వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ సేవా ఇస్లావాత్, టౌన్ ప్లానింగ్ డీసీపీ సుభాష్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.