తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 18: క్రీడలు వివిధ ప్రాంతాల వారిని పరిచయం చేస్తాయని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ స్థాయి క్రీడలు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఎల్ఎండీలోని రాంలీలా మైదానంలో గురువారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పరేడ్ నిర్వహించి, క్రీడా వందనం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. పోటీలు రోజంతా రసవత్తరంగా సాగాయి. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో వివిధ మండలాల జట్లు పోటీపడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయి క్రీడలను నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. గెలుపొందిన వివిధ జట్లకు ఎమ్మెల్యే ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, వివిధ పాఠశాలల పీఈటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.