తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 8:వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఊరూరా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ రోగాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నది.
వానకాలం పరిసరాల్లో నీరు నిలిచి ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతాయి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారానికి రెండు రోజులు డ్రై డేగా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘా ల సీఏలు, ఇతర పంచాయతీ సిబ్బంది ప్రతి మంగళ, శుక్రవారాల్లో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలిస్తున్నారు. గోళాలు, డ్రమ్ముల్లో ఎక్కువ కాలం నిలువ చేసిన నీటిని పారబోయిస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన
ప్రజలకు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. దోమలు, ఈగలు, కలుషిత నీటితో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. డెంగీ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇంటి చుట్టూ మురుగునీరు లేకుండా చూసుకుంటూ రక్షిత నీటిని తాగాలని సూచిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయిస్తున్నారు. అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ వేయిస్తూ దోమల వృద్ధిని అరికడుతున్నారు.
అప్రమత్తం చేస్తున్నాం
సీజనల్ వాధులపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేస్తున్నాం. పంచాయతీ పాలకవర్గాల సహకారంతో వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడితే దవాఖానలో చికిత్స తీసుకోవాలి.
-శ్రీనివాస్, వైద్యాధికారి, తిమ్మాపూర్