పెద్దపల్లి, జూలై 29 (నమస్తే తెలంగాణ) / పెద్దపల్లి రూరల్ : దళితులు అన్నివర్గాలతో సమానంగా ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. దేశంలో ఇప్పటివరకు పాలించిన వారెవరూ దళితులకు చేసిందేం లేదన్నారు. కానీ వారి తలరాతను మార్చేందుకే ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో రూ. 10 లక్షల చొప్పున జమ చేస్తున్నదని చెప్పారు. మేలైన యూనిట్లను ఎంచుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ, అవగాహన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి నియోజకవర్గాల్లోని 233 మందిని దళితబంధు కింద ఎంపిక చేశారు.
వీరిలో 130 మందికి రూ.21.85 కోట్లతో విలువైన యూనిట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.26.50 లక్షలతో 53 మందికి ఒక్కొక్కరికీ రూ.50 వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 17లక్షల కుటుంబాలకు ఈ స్కీంను వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఇచ్చే పది లక్షలను పదికోట్లు చేయాలని సూచించారు. తరతరాలుగా చితికిపోతున్న దళితుల జీవితాలు ఈ పథకంతో బాగుపడుతాయన్నారు.
వారికి ధైర్యాన్నిచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. గత పాలకులు వీరిగురించి ఆలోచించలేదన్నారు. లబ్ధిదారులు తాము ఏర్పాటు చేసుకున్న వ్యాపారాల్లో రాణించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జడ్పీ వైస్ చైర్మన్ మంగిడి రేణుక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, జిల్లాలోని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశానికే ఒక దిక్సూచి..
దళితబంధు పథకం దేశానికే దిక్సూచి లాంటింది. అన్ని రాష్ర్టాల్లోని దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం అమలు చేయలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కలలను నిజం చేస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దళితలను ఎలా బాగు చేయాలని తపించారు. ఈ స్కీంను ప్రారంభించి గొప్ప మార్పునకు నాంది పలికారు. దళితులు తమ బతుకులను తీర్చిదిద్దుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
గౌరవంగా బతుకుత..
నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి పెండ్లిళ్లకు బ్యాండ్ వాయించుకుంటూ బతుకుతున్న. కార్యాలు ఉన్నప్పుడు తిండీతిప్పలకు ఇబ్బంది ఉండేది కాదు. పెండ్లిళ్లు లేనిటైంల కూలి పనులకు వెళ్లేది. పనిదొరకని నాడు పస్తులుండాల్సి అచ్చేది. గిసొంటి బతుకు ఎంతకాలం అని రందిపడేది. ఇప్పుడు ప్రభుత్వం దళితబంధు కింద నా ఖాతాలో రూ.9.90 లక్షలు జమ చేసింది. ఈ పైసలతో సెంట్రింగ్ సామగ్రి, పాడ్ బ్యాండ్ వాహనాన్ని కొనుక్కున్న. మాలాంటి ఎందరో దళితుల బతుకులను మారుస్తున్న కేసీఆర్ సారును బతికినంత కాలం యాదిపెట్టుకుంటం.
– బొంకూరి సదయ్య, లబ్ధిదారు (గౌరెడ్డిపేట)
జీవితాలను మార్చుకునే అవకాశం..
ఒకప్పుడు చిన్న లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగి జమానత్గా ఉంటేనే అప్పు దొరికేది. అధికారులు, ప్రజాప్రతినిధులను బతిమిలాడాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజంలో అణగారిన వర్గాల తలరాతను మార్చేందుకు సంకల్పించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. దీనికింద ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేస్తున్నారు. మంచి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి. సర్కారు ఇచ్చిన పైసలను పదింతలు చేయాలి.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్