కార్పొరేషన్, జూలై 5: బీజేపీ నేతలకు తెలంగాణ అంటేనే నచ్చడం లేదు. ఇక అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుంటే కండ్లు మండించుకుంటున్నరు. వారికి ఎందుకింత కుళ్లు? అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు. పచ్చని రాష్ట్రంపై విషం చిమ్ముతూ సంక్షేమ పథకాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నరు. రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ ఒరగబెట్టిందేమీ లేదు. పేదల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రకటించలేదు. పేదల గురించి ఏ ఒక్క రోజూ ఆలోచించని ఆ పార్టీ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు తెస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ తెలంగాణపై కుట్ర చేస్తున్నది. ఇక ఎవరి ఆటలూ సాగవు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదు..? తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న ఆయుధం. అందరికీ అండగా ఉన్నరు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా పనిచేస్తున్నరు.
పచ్చని రాష్ట్రంపై బీజేపీ నాయకులు విషం చిమ్ముతున్నారని, పథకాల విచ్ఛిన్నానికి కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెం దిన 129 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1.29 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. వీరిలో కరీంనగర్ అర్బన్లో 84 మంది లబ్ధిదారులు, కొత్తపల్లి మండలంలో ఒకరు, కరీంనగర్ రూరల్ మండలంలో 44 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలోని బడు గు బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. గతంలో ఎందరో సీఎంలు వచ్చారు పోయారు కానీ నిరుపేదలను ఆదుకోవాలనే ఆలోచన ఎవరికీ రాలేదని విమర్శించారు. కరీంనగర్లో రోడ్ల అభివృద్ధితోపాటు మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ టవర్ వంటి వాటిని నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వీటితో పాటుగా ఇప్పటికే మెడికల్ కళాశాల మంజూరైందని, అలాగే టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మిస్తున్నామని చెప్పారు.
ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికంగా చేయూతనివ్వాలని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. తాను కూడా వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తినేనని, ఆ కులాల్లోని నిరుపేదలకు సేవ చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ మేనమామగా లక్ష రూపాయలు ఇస్తున్నాడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ నగర మేయర్ వై సునీల్రావు, ఎంపీపీ లక్ష్మయ్య, కార్పొరేటర్లు బండారి వేణు, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, ఐలేందర్యాదవ్ ఉన్నారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీతో ఒరిగిందేమీ లేదు. నిరుపేదల కోసం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేదు. నిరుపేదల సంక్షేమాన్ని పట్టించుకోని పార్టీ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సరారు తెస్తామనడంపై విడ్డూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్లో కలుపుతామని మాట్లాడుతున్నారు. ఇక వారి ఆటలు సాగవు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాడని తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న ఆయుధం.
– మంత్రి గంగుల కమలాకర్