తెలంగాణ రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో ప్రధానమైన రైతుబంధుకు వ్యవసాయ శాఖ ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారు నిర్ణీత పద్ధతిలో అర్జీ పెట్టుకుంటే వానకాలం-2022 పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం అందించనున్నది.
-హుజూరాబాద్, జూలై 2
గతంలో పంట వేసే సమయంలో పెట్టుబడి కోసం అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, దాదాపు నాలుగేండ్లుగా నిరాటంకంగా అమలు చేస్తూ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. డివిజన్లో ప్రస్తుతం దాదాపు 63,636 మంది అన్నదాతలు రైతు బంధు పథకంతో లబ్ధి పొందుతున్నారు.
ఈ నెల 10 వరకు గడువు
రైతు బంధు పథకం దరఖాస్తు కోసం జూలై 10వ తేదీ వరకు గడువు ఉంది. జూన్ 5వ తేదీ వరకు ధరణి పోర్టల్లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా రైతు బంధు పథకం అమలు కానున్నది. అప్పటి వరకు పట్టాదారు పాసుబుక్కు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసి ఉండి ఆ వివరాలు పాసుపుస్తకంలో నమోదైన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో సంవత్సరం పొడవునా అర్జీ పెట్టుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇస్తున్నదని.. దీనిని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.
బ్యాంకు ఖాతా మార్పునకూ అవకాశం
రైతు బంధు పథకంలో ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తమ బ్యాంకు ఖాతా మార్పునకూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఖాతా క్లోజ్ చేసి మరో బ్యాంకులో అకౌంట్ తీసుకున్నా.. ఇతరత్రా కారణాలతో అకౌంట్ మార్చుకునే రైతులు వెంటనే ఆ వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
రైతు బంధు పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా పట్టాదారు పాసుబుక్కులు పొందిన వారు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు బ్యాంకు ఖాతా పుస్తకం నకలు కాపీ జతచేసి ఇవ్వాలి. అలాగే బ్యాంకు అకౌంట్ మార్పు చేసుకునే రైతులు కూడా ఆయా జిరాక్స్ పత్రాలు అందజేయాలి. అయితే దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.
– పీ సతీశ్రెడ్డి, ఏఈవో, హుజూరాబాద్