రెవెన్యూశాఖకు చెందిన అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. భూమి సర్వే చేసి హద్దులు పెట్టేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసి, సోమవారం అడ్డంగా దొరికిపోయారు. రైతు నుంచి రూ.లక్ష తీసుకున్న ఆర్ఐ అసిస్టెంట్ లింగమూర్తి, లంచం అడిగిన ఆర్ఐ అజిమొద్దీన్, అంతర్గాం తహసీల్దార్ సంపత్కుమార్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించగా, రెవెన్యూ శాఖలో అలజడి రేగింది.
పెద్దపల్లి, మే 23(నమస్తే తెలంగాణ)/అంతర్గాం: భూ సర్వే చేసి హద్దులు చూపేందుకు రైతును రూ.3లక్షలు లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ వ్యక్తిద్వారా తీసుకుంటూ అంతర్గాం తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గాం మం డలం అకెనపల్లిలోని సర్వే నంబర్ 105, 107 లోని భూమి హద్దులు చేసేందుకు ఇదే మండలంలోని పెద్దంపేటకు చెందిన పెద్దంపేట శంకర్ అలియాస్ మెరుగు శంకర్ గౌడ్ ఐదు రోజుల క్రితం తహసీల్దార్ సంపత్కుమార్ను ఆశ్రయించాడు. దీంతో శంకర్ను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజీమొద్దీన్ను కలవాలని సూచించారు.
దీంతో శంకర్ మూడు రోజుల క్రితం ఆర్ఐని కలువగా, ఈ పని తహసీల్దార్ చేయాలంటే రూ.3లక్షలు కావాలంటున్నాడని శంకర్కు వివరించాడు. కంగుతిన్న శంకర్ తాను అంత డబ్బు ఇవ్వలేనని, రూ.50వేలు ఇస్తా పనిచేయాలని కోరాడు. ‘లేదు.. లేదు.. కనీసం రూ.2లక్షలైనా ఇవ్వాలి.. లేకపోతే నీ పని ఎప్పటికీ కాద’ని ఆర్ఐ చెప్పడంతో శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచనల మేరకు సోమవారం అంతర్గాం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. రూ.లక్ష తెచ్చానని, వచ్చి తీసుకోవాలని ఆర్ఐకి ఫోన్ చేసి చెప్పగా, తాను అందుబాటులో లేనని, తన ప్రైవేటు అసిస్టెంట్ లింగమూర్తికి ఇవ్వమని చెప్పాడు. దీంతో లింగమూర్తికి శంకర్ రూ.లక్ష ఇచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు, వెంటనే లింగమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆర్ఐ తీసుకోమన్నాడని చెప్పడంతో ఏసీబీ అధికారులు రామగుండంలోని ఎన్టీపీసీ టీటీఎస్ క్వార్టర్లో నివాసం ఉండే ఆర్ఐ వద్దకు వెళ్లి విచారించారు. అతను తహసీల్దార్ పేరు చెప్పడంతో లింగస్వామి, అజీమొద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో తహసీల్దార్ ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి కరీంనగర్లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఎవరైనా పనిచేసేందుకు డబ్బులు డిమాం డ్ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలి. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం. లంచం తీసుకున్న అధికారులు, సిబ్బంది చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. తప్పకుండా నేరం రుజువు అవుతుంది. ఈ ముగ్గురిని పూర్తి గా విచారించి. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం.
-ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి.
నాకు అంతర్గాం మండల ఆకెనపల్లిలో సర్వే నెం.105, 107లో భూమి ఉంది. దానిని భూమి హద్దు చేయాలి. సర్వే కోసం తహసీల్దార్ ఆఫీసుకు పోతే రూ.3లక్షలు కావాలని తహసీల్దార్, ఆర్ఐ వేధించారు. ఎంత బతిమిలాడినా వినలేదు. గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించా.
-పెద్దపేట శంకర్గౌడ్, బాధితుడు.