మల్యాల, మే 23: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. స్వస్తి వాచనం, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, అరుణి మథనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవమూర్తులను యాగశాల ప్రవేశం చేయించారు. యాగశాల ముందు సూర్యరశ్మి నుంచి అగ్నిని సృష్టించిన అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు త్రికుండాత్మక త్రైయాహ్నిక యజ్ఞాన్ని ప్రారంభించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం హోమం నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక వేదికపై పలువురు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి అంజన్నకు అర్చకుడు రామభద్రాచార్యులు, పర్యవేక్షకుడు కిశోర్ పట్టు వస్ర్తాలను తీసుకురాగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు స్వామివారికి సమర్పించారు. ముందుగా ఆ పట్టువస్ర్తాలను కొండగట్టు వై జంక్షన్ నుంచి మేళతాళాలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాల నడుమ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ఆలయానికి తీసుకొచ్చారు.
పెద్దజయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆంజనేయ స్వామి దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తున్నారు. ఉత్సవాల తొలి రోజునే మాల విరమణ మండపాన్ని తెరిచారు. విరమణ మండపంలో అంజనేయ స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచే అర్చకులు దీక్షావిరమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, జయంతి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో చేనేత కళాకారులు రాపోలు గణేశ్, కరుణాకర్, సురేందర్, సంతోష్, శ్రీనివాస్ స్వయంగా హరిత హోటల్లో మగ్గం ఏర్పాటు చేసుకొని చేనేత కళాకారుల సాయంతో నిష్టతో వస్త్రాలను తయారు చేశారు. స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించారు.