శంకరపట్నం, జూన్ 25: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతున్నదని, అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున మెట్పల్లి, అంబాల్పూర్ గ్రామాల్లో పర్యటించారు. పలువురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్వోసీలు అందజేశారు. దళిత వాడల్లో పర్యటించి ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.
మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలుకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమ పథకాలకు చిరునామాగా నిలిచారన్నారు. దళితబంధు పథకం ఎన్నో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని చెప్పారు. వచ్చే నెల నుంచి అర్హులందరికీ పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తున్నట్లు వివరించారు.
మెట్పల్లిలో ఇటీవల మాడ సతీశ్, మిడిదొడ్డి సాయితేజ అనారోగ్య కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అంబాల్పూర్లో దామెర సతీశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు సరోజన, వసంత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, ఉప సర్పంచ్లు హనుమంతు, రవీందర్ ఉన్నారు.