కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 24: ‘బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. అటు డబుల్ ఇంజిన్ సరారు అని చెప్పుకునే బీజేపీ, ఇటు మాటలతో కోటలు కట్టే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం. ఆ పార్టీలతో ఒరిగేదేమీ లేదు’ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి కాలనీలో గల మానేరు వాకింగ్ ట్రాక్లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి ప్రచారం చేశారు. ఎల్ఎండీలో నీటి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్కు స్మార్ట్సిటీ తీసుకువచ్చిన ఘనత వినోద్ కుమార్కే దకుతుందన్నారు. మానేరు తీరం లో వాకింగ్ ట్రాక్ను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగరవ్యాప్తంగా 14 వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్లో ప్రజల పక్షాన కొట్లాడి నిధులు తీసుకొచ్చేందుకు పోరాటం చేసే ఎంపీలు ఉండాలన్నారు. ఇప్పటికే నగరానికి మానేరు రివర్ ఫ్రంట్తో పాటు టీటీడీ ఆలయం నిర్మాణానికి రూ.25 కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వినోద్కుమార్ను గెలిపించాలని సూచించారు.
– బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్
బీఆర్ఎస్పై కాంగ్రెస్ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నదని, మేడిగడ్డ బరాజ్ పిల్లర్లను సాకుగా చూసి ప్రాజెక్టులను ఎడారిగా మార్చి రైతుల నోట్లో మట్టికొడుతున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతురాజ్యం తెస్తామన్న కాంగ్రెస్, అధికారంలోకి రాగానే రైతులను కన్నీరు పెట్టిస్తోందని ధ్వజమెత్తారు. గోదావరిలో రోజుకు 5వేల క్యూసెకుల నీళ్లు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదని, అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో 50 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందన్నారు. ప్రభు త్వం కొలువుదీరిన వెంటనే మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల వద్ద కాపర్ డ్యాం నిర్మించి, నీటిని ఎత్తిపోస్తే ఇప్పుడీ సాగునీటి సమస్యలు వచ్చేవికాదన్న వినోద్, పూర్తిగా వారి అసమర్థతతోనే యాసంగి పంటలు ఎండిపోయాయని ఆరోపించారు.
ప్రాజెక్టులను గాలికివదిలేయడంతో సాగునీటి కరువే కాదు కరీంనగర్ నగరవాసులు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం ఏం చేశాడని..? ఇప్పుడు ప్రజలను ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ఒక గుడి తేలేదని, ఒక నవోదయ పాఠశాల తేలేదని, వేములవాడ, కొండగట్టు ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధి కోసం నయాపైసా నిధులు తేలేదని విమర్శించారు. గంగుల కమలాకర్తో కలిసి తాము అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి కరీంనగర్లో టీటీడీ ఆలయం నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేయించి, పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎంపీగా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి దాకా రైల్వేలైన్ మంజూరు చేయించానని, నాలుగు జాతీయ రహదారులు తీసుకువచ్చినట్లు చెప్పారు.
కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మానేరు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆనందం, నర్సింగరావు, విద్యాసాగర్ రెడ్డి, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, మహేశ్, ఐలేందర్, తోట రాములు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ నాయకులు ఏవీ రమణ, జకుల నాగరాజు యాదవ్, శ్రీకాంత్, దూలం సంపత్ గౌడ్, రవినాయక్, కర్ర సూర్యశేఖర్, సాయి, శ్రీవారి పాల్గొన్నారు.