కార్పొరేషన్, ఏప్రిల్ 15: ‘వచ్చే ఎంపీ ఎన్నికల్లో నన్ను ఆదరించండి. మీ ఓటువేసి గెలిపిస్తే కరీంనగర్ సెగ్మెంట్ను అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతా’ అని పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. కరీంనగర్ సమస్యలపై, రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పారు. నగరంలోని 60వ డివిజన్లో సోమవారం ఉదయం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొని, మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగరానికి అర్హత లేకున్నా స్మార్ట్సిటీలో చేర్చానని, రూ. వెయ్యి కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసినట్లు వివరించారు.
కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వేలైన్ తీసుకువచ్చానని, వచ్చే డిసెంబర్ నాటికి అది కరీంనగర్ చేరుకుంటుందన్నారు. నగరంలో టీటీడీ ద్వారా రూ.25 కోట్లతో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి రూ.5 కూడా తీసుకురాలేదని విమర్శించారు. కరీంనగర్కు ఒక్క బడి, గుడి కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ అది కూడా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు.
బండి సంజయ్కి పదవి మీద తప్ప ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి మీద ద్యాస లేదని దుయ్యబట్టారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీ కోసం కూడా ప్రయత్నాలు చేస్తానన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చేందుకు, కొత్త ప్రాజెక్టులు తేచ్చేందుకు పోరాటం చేస్తానన్నారు. అలాగే రాజీవ్ రహదారిని, చొప్పదండి, మంచిర్యాల రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించే విధంగా కృషి చేస్తానని వివరించారు.
అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వారికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తమకు అనేక ఆలోచనలున్నాయని, వాటిని నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్లమెంట్కు ప్రశ్నించే గొంతుకగా వినోద్కుమార్ను పంపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కొట్లాడి మరి అనేక ప్రాజెక్టులు సాధించారని గుర్తుచేశారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్ వాల రమణారావు, ఐలేందర్, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.