ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త పాఠాలు
ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక
జగిత్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : విద్యాభ్యాసం ప్రధానంగా తొమ్మిది లక్ష్యాలైన ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, ఐక్యత, ధైర్యం, నమ్మకం, నిజాయితీ, విలువలపై జరుగాల్సిన అవసరమున్నది. అయితే, కాలగమనంలో ఈ విలువలు మృగ్యం అవుతున్నాయి. ఏవో కొన్ని లోపిస్తున్నానే ఉన్నాయి. విద్యాభ్యాసంలో మౌలిక సూత్రాలు మసకబారడంతో విద్యారంగం క్రమంగా తన విలువను కోల్పోతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు 9 అంశాల్లో విద్యాభ్యాసాన్ని అందించేందుకు పాఠశాల విద్య ‘హరివిల్లు’ పుస్తకాన్ని రెండు స్టేజీల్లో రూపొందించింది. 1, 2 తరగతులకు ఒకటి, 3,4,5 తరగతులకు రెండో స్థాయిగా వర్గీకరించారు. ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి రోజూ గంట సేపు హరివిల్లు బోధన చేస్తారు. దీని కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళికను రూపొందించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ బోధనను కొనసాగించనున్నారు.
ప్రత్యేక టైం టేబుల్..
హరివిల్లు స్టేజ్-1, స్టేజ్-2 తరగతుల కోసం ప్రత్యేక పాఠ్యపుస్తకంతో పాటు, సిలబస్ను రూపొందించారు. స్టేజ్-1, 2 తరగతుల వారికి సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారాల్లో కథాంశం, గురు, శుక్రవారాల్లో కృత్యాలు, శనివారం స్టేజ్-1 వారికి సమన్వయ కృత్యాలు, స్టేజ్-2 వారికి భావ వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతి రోజూ మానసిక సిద్ధత కోసం 3 నిమిషాలు, కోర్ ప్రాక్టీస్ కోసం 10 నిమిషాలు, చర్చకు 20 నిమిషాలు, ముగింపు కోసం 2 నుంచి 3 నిమిషాలు కేటాయించారు. మొత్తంగా ప్రతి రోజు ఉదయం లేదంటే సాయంత్రం గంట పాటు విద్యార్థులకు హరివిల్లు బోధన సాగుతుంది.
సిలబస్ ఆశయాలు, లక్ష్యాలు..
హరివిల్లు సిలబస్ను ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో రూపొందించారు. మానసిక సంసిద్ధతలో విద్యార్థికి మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెంపు, ఆలోచన ఉద్దీపణ, మానసిక ప్రశాంతత, క్రియ ఉన్నతి, శ్వాస కొనసాగింపు, శ్వాసపై ధ్యాసను పిల్లలకు అలవాటు చేయడం. ఇక కథాంశాల్లో విద్యార్థులకు విలువలతో కథలను బోధించడం, వాటిని తిరిగి విద్యార్థులతో చెప్పించడం, తరగతిగదిలో చెప్పిన కథలను పిల్లతో వారి ఇండ్లల్లో చెప్పేలా చేయించడం, సానుకూల వాతావరణంలో తరగతి గదిలో విద్యార్థులతో కథలను చెప్పించి, వారి అభిప్రాయాలను స్వీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో ఒక సానుకూల వాతావరణం, నిర్భయత్వం, ధారణ, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఇక కృత్యధారణ పిల్లల్లో రాతపై ఆసక్తిని కల్పించడం, అలాగే వివిధ సాంకేతిక వస్తువులు, ఇతర పరికరాలపై వారికి అవగాహన కల్పించడం అతి ముఖ్యమైన ప్రక్రియ.
చాలా సంవత్సరాలుగా కృత్యధారణ బోధన ఉండాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కృత్యధారణ విద్యాభ్యాసం అందించేందుకు సిలబస్ రూపొందించారు. చివరిది ‘సమన్వయ కృత్యం-భావ వ్యక్తీకరణ’. హరివిల్లు బోధనలో స్టేజ్-1, 2 విభాగాల్లో ప్రతి శనివారం వీటిని సెలబస్లో చేర్చారు. ఐదు రోజుల బోధన, విద్యాభ్యాసం తదుపరి శనివారం స్టేజీ-1 విద్యార్థులకు సమన్వయ కృత్యం నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులు ఐదు రోజుల్లో పొందిన జ్ఞానం, ఆచరణను పరిశీలిస్తారు. వాటితో పాటు భాషా నైపుణ్యం, భావ ప్రసారం, ముఖ కవలికల మార్పును పరిశీలిస్తారు. అలాగే, విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం ఇక్కడే మొలకెత్తుతుంది. ఇది అన్నింటికంటే ముఖ్యమైందిగా హరివిల్లు భావిస్తున్నది. ఇక రెండో స్టేజీలో విద్యార్థుల్లో శనివారం భావ వ్యక్తీకరణను పరిశీలిస్తారు. ‘భావ వ్యక్తీకరణ’ అనేది అనేక రకాలుగా జరుగుతుంది. మాటల ద్వారా, అభినయం, చిత్రాలు, బొమ్మలు గీయడం, పాటలు పాడడం, కవితలు రాయడం, గేయాలు ఆలపించడం ద్వారా పిల్లలు తమ భావ వ్యక్తీకరణ చేస్తారు. వీటన్నింటినీ హరివిల్లులో పరిశీలిస్తారు.
ఆరు వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ
హరివిల్లు బోధన విషయంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆరు వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించనున్నారు. జూమ్ ఆప్ ద్వారా ఇవ్వనుండగా, ఇప్పటికే రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లు, మండలానికి ఇద్దరు చొప్పున 114 మంది జిల్లా స్థాయి రిసోర్స్పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు రోజూ రెండున్నర గంటల పాటు శిక్షణను ఇవ్వనున్నారు. అనంతరం జిల్లాల్లోని ప్రభుత్వరంగ ఆధీనంలో ఉన్న అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో విద్యాభ్యాసం చేస్తున్న 80 వేల మంది విద్యార్థులకు హరివిల్లు మాడ్యూల్లో విద్యాభ్యాసం సాగనున్నది.
ఇవి కూడా చదవండి..
నైపుణ్యత ప్రదర్శించి ఉత్తీర్ణత సాధించాలి