Karimnagar | కమాన్ చౌరస్తా, మే 5 : పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ (సంక్షేమ ట్రస్ట్) ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడే వరకు అయ్యే ఖర్చులతో పాటు, వారికి మానసిక ధైర్యాన్ని, నైపుణ్యాన్ని అందించడమే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కపిల్ కార్యాలయంలో వారు మాట్లాడారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే విద్యార్థులకు మే 20, బుధవారం ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకు కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. పదో తరగతి సిలబస్ (గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ & ఇంగ్లీష్) ఆధారంగా ఈ పరీక్ష ఉంటుందని, ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే తెలిపారు.
పరీక్ష హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే (2025-26 విద్యా సంవత్సరం) చదివి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని వారు, సింగిల్ పేరెంట్ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పదో తరగతిలో కనీసం 520 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్ (వరంగల్ అర్బన్), హన్మకొండ (వరంగల్ రూరల్), జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు మాత్రమే ఈ అర్హతా పరీక్షకు అర్హులని, పరీక్ష రాయడానికి వచ్చే దూర ప్రాంత విద్యార్థులకు ఒకరోజు ముందుగా వచ్చినట్లయితే రాత్రి ఉండడానికి వసతి కూడా ఇవ్వనున్నారు.
పరీక్ష మే 20-2026, శ్రీ సరస్వతీ శిశు మందిర్, గాయత్రీ నగర్, కరీంనగర్ ఉంటుందని, ఆసక్తి గల విద్యార్థులు మే 15 లోపు www.kapilvidyavaradhi.org వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్ష అనంతరం భోజన వసతి ఉంటుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకుండా మిగతా జిల్లాల నుండి వచ్చే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు ఇవ్వబడతాయని, మరిన్ని వివరాలకు అప్పిడి రాజిరెడ్డి: 98485 26865, గీకురు శ్రీనివాస్: 99854 82292 సంప్రదించవచ్చని చెప్పారు.