మారుతీనగర్, ఫిబ్రవరి 24: నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాన్ని శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు కంటి పరీక్షలను స్వయంగా చేయించి, వారి సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కంటికి శస్త్ర చికిత్స అవసరం ఉంటే వైద్యుల సూచనలతో ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందన్నారు.
ఈ సందర్భంగా కంటి పరీక్షలకు వచ్చిన ఓ వృద్ధురాలు సామల్ల కళావతి తనకు రేషన్ కార్డు ఇప్పించాలని కోరగా, వెంటనే ఆయన స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పురాతనమైన విఠలేశ్వరాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాభివృద్ధికి టీటీడీ నుంచి నిధుల మంజూరు కోసం ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు వినతిపత్రాన్ని అందజేయగా, తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి ఉమారాణి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, వార్డు కౌన్సిలర్ మర్రి సహదేవ్, ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.