కరీంనగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ఉత్సాహంగా సాగుతున్నది. రెండో రోజు శుక్రవారం అంతటా విశేష స్పందన కనిపించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించిన శిబిరాలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందించారు. పాయింట్ ఎక్కువ ఉన్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అద్దాలను ప్రత్యేకంగా తయారు చేయించి త్వరలోనే ఇవ్వనున్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో శిబిరాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. చైతన్య యూత్ క్లబ్లో శిబిరాన్ని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు. డీఎంహెచ్వోతోపాటు ప్రోగ్రాం అధికారులు పలు శిబిరాలను సందర్శించి, వైద్య బృందాల సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలో 48 క్యాంపులు నిర్వహించినట్లు డీఎంహెచ్వో జువేరియా తెలిపారు. 5530 మంది పురుషులు, 6050 మంది మహిళలు మొత్తం 12580 మందికి స్రీనింగ్ పరీక్షలు చేశామని, 7,350 మందికి ఎలాంటి దృష్టి లోపాలు లేవని చెప్పారు. 2454 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించామని, 2038 ప్రిస్రైబ్డ్ కండ్ల జోళ్లను సూచించామని, వారం రోజుల్లోగా వారి వారి ఇళ్లకు పంపిస్తామన్నారు.
రత్నమ్మకు కొత్త వెలుగు
.. ఈ ఫొటోలో కనబడుతున్న ముసలవ్వ పేరు జారుగుల రత్నమ్మ.. 100 ఏళ్ల దాకా ఉంటుంది. పెద్దపల్లిలోని శాంతినగర్లో ఉంటుంది. ఈమెకు ఒక కూతురు. కాగా, ఆమెకు పెళ్లి అయిన తర్వాత రత్నమ్మ ఒంటరిగా జీవిస్తున్నది. పేదరికంలో ఉన్న రత్నమ్మ గతంలో ఒకసారి వైద్యులకు చూపించుకున్నా మళ్లీ చూపు మందగించింది. చేతిలో పైసలు లేకపోవడంతో అలాగే కాలం వెల్లదీస్తూ వస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న రత్నమ్మ పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ప్రారంభించిన కంటి వెలుగు శిబిరానికి శుక్రవారం వచ్చింది. మంత్రి ఈశ్వర్ సైతం ముసలవ్వను పిలిచి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కండ్లు కనబడుతున్నయా? అని అడిగారు. లేదు బిడ్డా.. ఇప్పుడు చూపించుకుంట.. అని చెప్పగా, కంటి పరీక్షలు చేయించి కంటి అద్దాలను అందజేశారు మంత్రి. ‘నా లాంటి పేదోళ్ల దేవుడు కేసీఆర్ . కండ్ల పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిన్రు. అద్దాలు పెట్టుకుంటే కండ్లు మంచిగ కనబడుతున్నయ్. కేసీఆర్ సారు చల్లంగా ఉండాలె’ అంటూ రత్నమ్మ భావోద్వేగానికి గురైంది.
అద్దాలు బాగున్నయ్
నేను కొద్దిరోజులుగా దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న. పనులు చేసుకునేందుకు ఇబ్బంది అవుతున్నది. దవాఖానకు వెళ్లేందుకు వీలుకాలె. అది ఖర్చుతో కూడుకున్న పని కదా.. ఇక ఎక్కడ చూపించుకోలె. టౌన్లో పెట్టిన శిబిరానికి ఈ రోజు వచ్చిన. వైద్యులు పరీక్షించిన్రు. అప్పటికప్పుడే అద్దాలు ఇచ్చిన్రు. బాగున్నయ్. కండ్లు మంచిగా కనిపిస్తున్నయ్. కంటి వెలుగు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి థ్యాంక్స్.
– ఉమ, విద్యానగర్ (కరీంనగర్)
వెలుగునింపిన దేవుడు కేసీఆర్
మేమిద్దరం భార్యాభర్తలం. మాది హుజూరాబాద్లోని బోర్నపల్లి. చాలా రోజుల సంది మాకు కండ్లు సక్కగ కానస్తలేవు. బియ్యంలో రాళ్లు కూడా ఏరలేకపోతుంటిని. ఎట్లా అని రందివడ్డ. దవాఖానకు పోవాలంటే వేలకువేలు కావాల్నాయె. అన్ని పైసలు మా దగ్గర ఎక్కడున్నై. అందుకే ఏదైతే అదైందని చాలించుకున్నం. కేసీఆర్ సారు మా అసోంటోళ్ల కోసం కంటి వెలుగు తెచ్చి గొప్ప మేలు చేసిండు. ఇయ్యాలనే కేంద్రానికి పోయినం. డాక్టర్లు పరీక్షలు చేసిన్రు. ఇద్దరికీ అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. ఇన్ని మంచి పనులు చేస్తున్న తెలంగాణ సర్కారుకు మాలాంటి వృద్ధుల దీవెనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటయ్.
– గునిగంటి మల్లమ్మ, లింగయ్య దంపతులు, బోర్నపల్లి (హుజూరాబాద్టౌన్)
రెండేండ్ల గోస పోయింది
సర్కారు వైద్యం అంటే గతంల నమ్మకం లేకుండె. ఏదీ కరెక్ట్గా చేయరని, అస్సలు పట్టించుకోరని అనుకునేది. కానీ, రాష్ట్రం వచ్చినంక సర్కారు దవాఖాన్లు మంచిగైనయ్. ప్రైవేట్ కంటే మంచిగా సేవలందిస్తున్నరు. ఇప్పుడు కంటి వెలుగుతో ఉన్న ఊరిలోనే వైద్యం ఫ్రీగా చేస్తున్నరు. నాకు రెండేండ్ల సంది కండ్లు మస్క మస్కగా కనిపిస్తున్నయ్. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న. ప్రైవేటుకు పోదమంటే ఎన్ని పైసలైతయోనని ఊకున్న. ఈ రోజే కంటి వెలుగు శిబిరానికి వచ్చిన. డాక్టర్లు చాలా ఓపిగ్గా పరీక్షలు చేసిన్రు. మంచి డిజైన్ అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కంటి చూపు చాలా తేజ్గా కనిపిస్తున్నది. నాది నేనే నమ్మలేకపోయిన. రెండేండ్ల గోస పోయింది. ప్రభుత్వానికి రుణపడి ఉంట.
– వెన్ను బాలశంకర్, గంభీరావుపేట
చూపు మెరుగైంది..
నాకు ఇంతకు ముందు అద్దాలు లేక కండ్లు మసక మసకగా కనిపించేవి. కంటి వెలుగులో చూపించుకుంటే సైటు వచ్చిందని చెప్పి అద్దాలు ఇచ్చిన్రు. అవి పెట్టుకోగానే ఇన్ని రోజులు ఉన్న మబ్బులన్నీ పోయి చూపు బాగా కనిపిస్తుంది. మాములు అద్దాలు ఇస్తరు..? కండ్లు కనిపించవు..? అని మా దోస్తులు అంటే నిజమే కావచ్చనుకున్న. కానీ కంటి వెలుగు అద్దాలు చక్కగా కనిపించడమే కాకుండా చాలా రిచ్గా ఉన్నయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి మా లాంటి వారి అండదండలు తప్పక ఉంటయ్.
– నాంపల్లి కొమురయ్య, నిరుద్యోగి, బోర్నపల్లి
(హుజూరాబాద్టౌన్)
కంటి వెలుగు మంచి పథకం
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న. నాకు కంటి సమస్య ఉన్నది. చదువడం, రాయడం కొంత ఇబ్బంది అవుతున్నది. ప్రైవేట్ దవాఖానల డబ్బులు ఎంతైతయోనని ఆగిపోయిన. కానీ, మా ఊర్లనే కంటి పరీక్షలు చేస్తుండడంతో ఇక్కడికి వచ్చిన. ఉచితంగా టెస్ట్ చేసి అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు స్పష్టంగా చదువగలుగుతున్న. కంటి వెలుగు చాలా మంచి పథకం. కేసీఆర్ సార్కు థాంక్స్.
– ఆకారపు ఆశ్విత, డిగ్రీ విద్యార్థిని, కొలనూర్(ఓదెల)
ఫ్రీగానే అద్దాలిచ్చిన్రు
నాకు కండ్ల సమస్య ఉండె. ప్రైవేట్ దవాఖానల చూపెట్టుకుందామనుకున్న. కానీ, నిర్లక్ష్యం జేసిన. మా ఇంటికి ఆశా కార్యకర్త వచ్చి ఈ రోజు నీకు కండ్ల పరీక్షలు ఊర్లనే చేస్తరని కాగితం ఇచ్చింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి కండ్ల పరీక్షలు చేయించుకున్న. నాకు అద్దాలు అవసరమని చెప్పి పైసా తీసుకోకుండా అద్దాలు ఇచ్చిన్రు. ఊర్లకు సార్లు వచ్చుడు జెయ్యవట్టి కంటి పరీక్షలు ఈజీగా అయితున్నయ్. పేదోళ్ల కళ్ల సమస్యలను తీర్చుతున్న కేసీఆర్ సార్ ఆలోచన బాగుంది. సార్కు కృతజ్ఞతలు.
– రాంనేని సునిల్, ఓదెల
మా ఊర్లనే కంటి పరీచ్చలంటే అచ్చిన..
నాకు 80ఏళ్లు దాటినయ్. ఇప్పటి వరకు నా కండ్లు మంచిగనే కనిపించినయ్. మొన్నటి సంది మస్క మస్కగా అయినయ్. ఇంటోళ్లను కట్టపెట్టద్దని అనుకున్న. అందుకే గిన్ని దినాలు ఎవరికీ చెప్పలె. దవాఖానకు పోలె. గిప్పుడు మా ఊర్లకు కేసీఆర్ సార్ కండ్ల పరీచ్చలు చేసేటోళ్లను పంపించిండని చెప్పిన్రు. గందుకే మెల్లమెల్లగ పంచాయతీ ఆఫీసు కాడికి అచ్చిన. పైసలు తీసుకోకుండా అట్టిగనే పరీచ్చలు చేసిర్రు. గిట్ల జేసుడు మా అసోంటి ముసలోళ్లకు చాన నయం. ఆపరేషన్ చేస్తమని చెప్పిన్రు.
– నాగపూరి లక్ష్మి, వృద్ధురాలు (ఓదెల)