పెద్దపల్లి /పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : అఖిలాండకోటి బ్రహాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి-అలివేలు మంగ-పద్మావతి సమేత కల్యాణ మహోత్సవం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెప్పించిన ఉత్సవ విగ్రహాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి-పుష్పలతారెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలను స్వామి వారికి సమర్పించగా, తిరుమల దేవస్థానం అర్చక బృందం వివాహ వేడుకను ఘనంగా జరిపించారు. నియోజకవర్గంలో మొట్టమొదటి సారి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి-ప్రశాంత్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.