చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మండల పరిషత్ కార్యాలయంలో 140 మందికి చెక్కుల పంపిణీ
గంగాధర, మే 17: పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 140 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1,40,16,240 విలువైన చెక్కులు మంజూరు కాగా, మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు రూ.1,00,116 విలువైన చెక్కుతో పాటు చీరె, జ్యూట్ బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. 2014కు ముందు ఆడపిల్ల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అప్పులు చేసేవారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గుర్తు చేశారు.
నేడు కల్యాణలక్ష్మి కింద అందజేస్తున్న సాయం ఎన్నో పేద కుటుంబాల్లో కల్యాణకాంతులు నింపుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్రెడ్డి, శ్రీమల్ల మేఘరాజు, ఎండీ నజీర్, మాల చంద్రయ్య, పొట్టాల కనకయ్య, రాసూరి మల్లేశం, కొంకటి శంకర్, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు తోట మల్లారెడ్డి, పాశం కుమార్, ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, పంజాల ఆంజనేయులు, సామంతుల శ్రీనివాస్, గుండవేని తిరుపతి, ఎగర్లు మల్లయ్య, గర్వందుల పరశురాములు, పెంచాల చందు, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల అజయ్, మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందం డబుల్!
ఇటీవల ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిన ఓ పేద కుటుంబానికి ఒకే రోజు రెండు కల్యాణలక్ష్మి చెక్కులు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గంగాధర మండల కేంద్రానికి చెందిన లోకిని లచ్చమ్మ-లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు కూతుర్లు కవిత, అఖిల. గతేడాది నవంబర్ 24, 27 తేదీల్లో వారి పెళ్లి జరిపించి, కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో లచ్చమ్మ ఇద్దరు కూతుళ్లకు ఒక్కొక్కరికి రూ. 1,00,116 మంజూరు కాగా, మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో లచ్చమ్మ దంపతులకు రెండు చెక్కులను అందజేయగా, వారు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు.