కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 9: జిల్లా వ్యాప్తంగా శనివారం తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కాళోజీ చిత్రపటానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టీ శ్రీలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు నారోజు వెంకటరమణ, డాక్టర్ మల్లోజుల లక్ష్మణరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రితేష్ మెహతా కార్యక్రమాన్ని ప్రారంభించగా, విద్యార్థులు నృత్యాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అంతకు ముందు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వావిలాలపల్లిలోని సెయింట్ పాల్స్ హైసూల్లో కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు వివిధ చార్ట్ల ద్వారా తెలంగాణ భాషలోని సామెతలు, పద్యాలు, తెలంగాణ కవుల వివరాలు సేకరించి ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని, పాఠశాల డైరెక్టర్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నగరంలోని మానేరు విద్యాసంస్థల్లో కాళోజీ చిత్రపటానికి విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు చేసిన నాటిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలంగాణ భాషా దినోత్సవం గురించి వివరించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ సరితారెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు శేషాంజని, మాలతి రెడ్డి, సుస్మిత, వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో రేకుర్తిలోని కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య మాట్లాడుతూ, కాళోజీని స్మరిస్తూ పలు కవితలు ఆలపించారు. ఈ సందర్భంగా గీత కార్మికుడు లచ్చయ్యకు కాళోజీ జ్ఞాపిక అందజేశారు. ఇక్కడ బూర్ల వెంకటేశ్వర్లు, గాజోజు నాగభూషణం, సీవీ కుమార్, కూకుట్ల తిరుపతి, దామరకుంట శంకరయ్య, శ్రీరాం, విలాసాగరం రవీందర్, డాక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రేకుర్తిలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్ రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాతూరి రాజ్ రెడ్డి, అట్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, వేణుగోపాల చారి, ప్రశాంత్, కుమారస్వామి, శ్రావణ్, అశోక్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముకరంపుర, సెప్టెంబర్ 9: రేకుర్తిలోని కాళోజీ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, కాళోజీ విగ్రహానికి మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవీ-కృష్ణాగౌడ్, ఏదుల్ల రాజశేఖర్, జయశ్రీ, దిండిగాల మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి, వాల్యూ హోమ్స్ అధ్యక్షుడు రమణారెడ్డి, రేకుర్తి వాసులు, బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 9: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కాళోజీ చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు గౌతమి, మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు నరేశ్రెడ్డి, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే, రేకుర్తిలోని పారడైజ్ పాఠశాలలో కాళోజీ చిత్రపటానికి విద్యా సంస్థల చైర్మన్ డా. ఫాతిమారెడ్డి, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ సీఈవో మధు, ఏవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, సెప్టెంబర్ 9: ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికి జోనల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వినోద్కుమార్, ఆర్ఎం సుచరిత పూల మాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ ఆర్ఎంలు చందర్రావు, సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ చంద్రయ్య, డీఎంలు మల్లయ్య, మల్లేశం పాల్గొన్నారు.